ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల దీక్ష : రేవంత్ రెడ్డి

ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల దీక్ష : రేవంత్ రెడ్డి

తెలంగాణలో  బెంగాల్ తరహా రాజకీయాలు చేయాలని చూస్తున్రు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలోని సమస్యలపై టీఆర్ఎస్, బీజేపీలు చర్చకు రాకుండా నాటకాలాడుతున్నాయని.. ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కూలీలు, పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలు, గిరిజనులు.. నిరుద్యోగులు.. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాన సమస్యలపై చీఫ్ సెక్రెటరీకి వినతిపత్రం ఇవ్వడంతో ఉద్యమాన్ని మొదలుపెడతామని రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. 

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో, రాహుల్ గాంధీ నిర్వహించిన  భారత్ జోడో యాత్ర కోసం బాగా కష్టపడ్డామని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్  పార్టీలు కొన్ని వివాదాస్పద అంశాలను చర్చకు పెట్టి.. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా నాటకాలాడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో కూడా నయీమ్ కేసు, డ్రగ్స్ కేసు, ఆర్టీసీ కార్మికుల ధర్నాలను వివాదాస్పదం చేశారని, తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. 

పోల్ పోలరైజేషన్ కోసం బీజేపీ, టీఆర్ ఎస్ డ్రామాలు చేస్తున్నాయని, దీనిపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రైతు రుణమాఫీ 47 లక్షల మందికి 25 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. వారికి పరిహారం, ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేలా ఒత్తిడి తేవాలన్నారు. అలాగే అసైన్డ్ భూములను సీలింగ్ ల్యాండ్ పేరుతో ప్రభుత్వం పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తోందని.. పోడు భూముల సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ధాన్యం కొనుగోలు సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యలపై చీఫ్ సెక్రెటరీకి వినతిపత్రం ఇవ్వడంతో కార్యాచరణ ప్రారంభిద్దామని రేవంత్ రెడ్డి సూచించారు. 

అన్ని మండల కేంద్రాల్లో.. జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందిరాపార్క్ వద్ద రెండు రోజుల దీక్షా కార్యక్రమం చేపట్టాలని, సోమవారం నుంచి డిసెంబర్ 5 లోపు ఈ కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. 

దశలవారీగా పోరాటాలు చాలా అవసరం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

దశల వారీగా పోరాటాలు చాలా అవసరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు.  వ్యవసాయం, రైతుల అంశాలు ఇప్పుడు చాలా కీలకం అన్నారు. ముందు నియోజక వర్గాలలో పోరాటాలు చేసి.. ఆ కార్యక్రమాల ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్, ఇన్ పుట్స్ తో చీఫ్ సెక్రెటరీకి వినతి పత్రం ఇవ్వాలని అన్నారు. అలాగే జిల్లాల్లో చేసిన తర్వాత గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వాలని, ఈ పోరాటాలను చాలా కీలకంగా భావించి పని చేద్దామని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.