ఎమ్మెల్సీగా సంతృప్తి లేదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: పాడి కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్సీగా సంతృప్తి లేదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా:  పాడి కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్సీగా తనకు సంతృప్తి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిస్తేనే తనకు సంతృప్తిగా ఉంటుందన్నారు.  వీణవంక మండలం కొండపాక గ్రామంలో కొత్త గ్రామ పంచాయతి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను బరిలో ఉంటానని అన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సమస్యలు తీరుస్తానని చెప్పారు. త్వరలోనే ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు.

అంతకు ముందు హనుమకొండ జిల్లా కమలాపురంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కల్యాణ లక్ష్మీ చెక్కులు వచ్చాయని సమాచారం ఇచ్చినా.. కొంత మంది లబ్ధిదారులు కార్యక్రమానికి రాలేదని అసహనం వ్యక్తం చేశారు..హాజరుకాని వారికి చెక్కులు క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. అన్ని పథకాలు తీసుకుంటారు కానీ.. టీఆర్ఎస్ కు మాత్రం ఓటేయ్యరు అంటూ లబ్ధిదారులపై మండిపడ్డారు.అనంతరం లబ్ధిదారులతో థాంక్యూ కేసీఆర్ అంటూ బలవంతంగా చెప్పించారు.