సమ్మె వెనుక మా పార్టీ వాళ్లే ఉన్నరు
వాళ్లెవరో ముఖ్యమంత్రికి చెప్తా: టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
ఆర్టీసీ సమ్మె వెనుక టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఉన్నారని, వాళ్ల పేర్లు ముఖ్యమంత్రి కేసీఆర్కు చెప్తానని ఆ పార్టీ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆర్టీసీ సమ్మె గురించి ఇప్పుడు మాట్లాడడం కాదు కానీ.. సమ్మె వెనుక మా వాళ్లు ఉన్నరు.. కొందరు వచ్చి నా చెవిల చెప్తున్నరు. పార్టీకి నష్టం జరుగొద్దు.. నా దగ్గర వివరాలు ఉన్నయ్.. సీఎంకు వివరిస్తా” అని మంగళవారం ఉదయం ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపాయి. మధ్యాహ్నానికే ముత్తిరెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తానొకటి చెప్తే మరొకటి వచ్చిందని ఒకసారి.. అసలు ఏమీ మాట్లడలేదని మరోసారి ఆయన అన్నారు. ‘‘సమ్మె వెనుక టీఆర్ఎస్ నేతల హస్తం ఉందన్న మాటలు నేను అనలేదు.. ఆ వీడియోలో వచ్చింది వాస్తవం కాదు. అసలు నేను ఏమీ మాట్లడలేదు.. అది ఎలా వచ్చిందో తెలియదు” అని పేర్కొన్నారు.
