హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలనలో భాగంగా స్కీమ్లను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు మంత్రులకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జ్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. సీఎం, డిప్యూటీ సీఎం మినహా పది మంది మంత్రులకు పది జిల్లాలను అప్పగిస్తూ ఆదివారం సీఎం శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులకు వారి వారి సొంత జిల్లాలు కాకుండా వేరే జిల్లాలకు ఇన్చార్జ్లుగా నియమించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కరీంనగర్ ఇన్చార్జ్గా, దామోదర రాజ నర్సింహను మహబూబ్నగర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఖమ్మం జిల్లా బాధ్యతలు అప్పగించింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబును రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వరంగల్, పొన్నం ప్రభాకర్ను హైదరాబాద్, కొండా సురేఖను మెదక్, సీతక్కను ఆదిలాబాద్, తుమ్మల నాగేశ్వర్ రావును నల్గొండ జిల్లాలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూపల్లి కృష్ణా రావును నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్గా నియమించింది. ఆయా ఇన్చార్జ్ మంత్రులు వారికి అప్పగించిన జిల్లాల్లో ప్రజాపాలనకు సంబంధించిన కార్యకలాపాలు, సమీక్షలు పర్యవేక్షిస్తారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
మంత్రుల చేతుల మీదుగా పథకాల అమలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ మంత్రులను జిల్లాలకు ఇన్చార్జ్లుగా నియమించినా.. జీవో జారీ చేయలేదు. చాలా జీవోలు దాచేసి.. రహస్యంగా పనులు కానిచ్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంది. కానీ, కాంగ్రెస్ సర్కార్ జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రుల విషయంలో జీవో ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా స్కీమ్లు అమలు చేయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రుల చేతుల మీదుగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇన్చార్జ్ మంత్రుల ఆమోదంతోనే పథకాలు ప్రజల వద్దకు చేర్చాలని భావిస్తున్నది.