
- పేపర్ లీకులు, నోటిఫికేషన్ల రద్దుతో ఆవేదన
- ఊర్లను విడిచి వచ్చి ఏండ్లుగా పట్నంలోనే ప్రిపరేషన్
- హాస్టళ్లకు, కోచింగ్కు లక్షల్లో ఖర్చు
- ఇప్పుడు మళ్లీ ప్రిపరేషన్కు పైసలు ఎట్లనే ఆందోళన
- ఇంట్లో వాళ్లకు ఏమని చెప్పాలంటూ అభ్యర్థుల కన్నీళ్లు
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దు కావడం నిరుద్యోగులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నది. కుటుంబాలకు దూరమై.. కంటి నిండా నిద్రపోక, కడుపునిండా తినక.. కష్టాలను, కన్నీళ్లను భరిస్తూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆశలకు టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం, రాష్ట్ర సర్కారు అలసత్వం గండికొడుతున్నాయి. ఒకే పరీక్షను రెండు సార్లు రాశామని, ఇప్పుడు మూడోసారి రాయాల్సి వస్తుందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సర్కారు కొలువు కోసం కొన్నేండ్లుగా ప్రిపేర్ అవుతున్నామని, ఇంకా ఎన్నాళ్లు ఇలా అవస్థలు పడాలని ప్రశ్నిస్తున్నారు. తర్వాత పెట్టే పరీక్ష అయినా సరిగ్గా నిర్వహిస్తారా? అని నిలదీస్తున్నారు.
దెబ్బకొట్టిన పేపర్ లీక్
రాష్ట్రంలో 80 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఏడాదిన్నర క్రితం ప్రకటించారు. వివిధ బోర్డుల ద్వారా నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. దీంతో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారు. ఈ క్రమంలోనే గ్రూప్1, గ్రూప్ 2, గ్రూప్3, గ్రూప్ 4 తదితర 17 వేలకు పైగా పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చింది. గతేడాది అక్టోబర్11న గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష జరగ్గా, 2.85 లక్షల మంది హాజరయ్యారు. జనవరి 22న జరిగిన ఏఈఈ ఎగ్జామ్ కు 61 వేల మంది, ఫిబ్రవరి 26న జరిగిన డీఏఓ ఎగ్జామ్ కు 67 వేల మంది, మార్చి 5న జరిగిన ఏఈ ఎగ్జామ్ కు 55 వేల మంది పరీక్ష రాశారు.
గ్రూప్1 ప్రిలిమ్స్ రిజల్ట్ రాగా1:50 రేషియోలో 25 వేల మందిని మెయిన్స్కు ఎంపిక చేశారు. ఈ టైంలో పేపర్ లీకయిందని, ఆ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో నిరుద్యోగుల్లో అయోమయం మొదలైంది. ఇంత జరిగినా.. టీఎస్పీఎస్సీలోని ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకుండానే మళ్లీ జూన్ 11న రెండోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ పరీక్షను 2.33 లక్షల మంది రాయగా, ఫలితాలను కూడా రిలీజ్ చేశారు. అయితే టీఎస్పీఎస్సీ సరిగా పరీక్ష నిర్వహించలేదంటూ హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.
హాస్టళ్లలో ఉంటూ.. కోచింగ్ తీసుకుంటూ..
వేలాది మంది అభ్యర్థులు తమ సొంతూర్లను విడిచి.. హైదరాబాద్కు వచ్చి ప్రిపేర్ అవుతున్నారు. హాస్టళ్లలో ఉంటూ, ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో ఇంటిమొహం చూడకుండా కొలువుల కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రతి నెలా ఇంటి నుంచి పంపే డబ్బులతోనే అన్నింటినీ చూసుకున్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే తప్పా ఊర్లకు వెళ్లడం మానేశారు. ఒక్కొక్కరు 8, 9 ఏండ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఉదయం5 గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా లైబ్రరీలు, స్టడీ హాళ్లలో ప్రిపేర్ అయినా, ఫలితం లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
తమ పేరెంట్స్ అప్పులు చేసి మరీ డబ్బులు పంపిస్తున్నారని, ఇప్పుడు వాళ్లకు ఏమని సమాధానం చెప్పాలని వాపోతున్నారు. ఏండ్ల నుంచి లక్షలు ఖర్చు చేసి, మళ్లీ ప్రిపేర్ కావాలంటే ఎలా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క కిందిస్థాయి సర్కారు జాబ్స్ చేసేవారు, టీచర్లు సెలవులు పెట్టగా.. ఎంతో మంది ప్రైవేటు కొలువులు వదిలిపెట్టి వచ్చి ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు కావడంతో, మిగిలిన పరీక్షలైనా సరిగా జరుగుతాయా లేదా అనే అయోమయంలో ఉన్నారు.
జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు
ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నామో అది నెరవేరడం లేదు. 2019లో గ్రూప్1 జాబ్ కోసం హైదరాబాద్కు వచ్చి ప్రిపేర్ అవుతున్న. మా నాన్న కల డీఎస్పీ జాబ్. దాన్ని ఎలాగైనా సాధించాలనే లక్ష్యంతో చదువుతున్న. మొదటిసారి క్వాలిఫై అయ్యా. ఈసారి కూడా మంచి మార్కులే వచ్చాయి. కానీ రెండూ రద్దు అయ్యాయి. ఇలా అభ్యర్థులు, స్టూడెంట్ల జీవితాలతో ఆడుకోవడం సరికాదు. ఒకసారి రద్దు అయినప్పుడు, మరిన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాల్సింది.
రవళి, కరీంనగర్
ఆరేండ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న
నేను ఐఐటీ బాంబేలో చదివి.. సివిల్స్కు, గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్న. మాది పేద కుటుంబం. ఆరేండ్ల నుంచి ఇంటి నుంచి పంపే డబ్బులతోనే ప్రిపేర్ అవుతున్న. ప్రతినెల ఇంటి దగ్గర డబ్బులు అడగాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తున్నది. డిప్యూటీ కలెక్టర్ కావాలనే కల.. సర్కారు నిర్లక్ష్యంతో నెరవేరేలా లేదు. రెండోసారి కూడా గ్రూప్ 1 రద్దు కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యా.
నవీన్, సూర్యాపేట
ఇంట్లో ఏం చెప్పాలి?
మాది ఓ మారుమూల ప్రాంతం. ఆరేండ్లుగా గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న. అమ్మ బీడీలు చేసి, నాన్న ట్యాక్సీ నడిపి నాకు డబ్బులు పంపిస్తున్నారు. ఫస్ట్ టైమ్ రాసిన పరీక్షలో 92 మార్కులు వచ్చాయి. మెయిన్కు క్వాలిపై అయ్యా. పేపర్ లీకైందని రద్దు చేయడంతో.. రెండోసారీ గట్టిగానే ప్రిపేర్ అయ్యా. ఇప్పుడు మంచి మార్కులే వచ్చాయి. కానీ టీఎస్పీఎస్సీ నిర్వహణ లోపంతో హైకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు ‘జాబ్ ఎప్పుడు వస్తది?’ అని అమ్మానాన్న అడిగితే ఏం చెప్పాల్నో అర్థమైతలే.
ఎన్వీ రమణ, నిర్మల్ జిల్లా
ఎన్ని రోజులు చదవాలి
ఆరేండ్లుగా సర్కారు కొలువు కోసం ప్రిపేర్ అవుతున్న. బాసర ట్రిపుల్ ఐటీలో చదువు పూర్తయిన తర్వాత ఇతర దేశాల్లో జాబ్ ఆప్షన్లు వచ్చినా, మన రాష్ట్రంలోనే జాబ్ చేయాలనే నాన్న కోరికతో ఇక్కడే ఉన్నా. ఢిల్లీలోనూ కోచింగ్ తీసుకున్న. మొదటిసారి గ్రూప్ 1 లో 103 మార్కులు వచ్చి, మెయిన్ కు క్వాలిఫై అయ్యా. డీఏఓ, ఏఈ ఎగ్జామ్స్ కూడా రాస్తే.. వాటిని రద్దు చేశారు. టీపీఓకు ప్రిపేర్ అయితే, పరీక్షకు రెండ్రోజుల ముందు రద్దు చేశారు. నాన్న దుబాయ్ లో కష్టపడుతూ నన్ను చదివిస్తున్నాడు. ప్రతిసారి ఇంట్లో డబ్బులు అడగలేక ఇక్కడే ప్రైవేటు సంస్థలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్న. ఇలా ఇంకా ఎన్నిరోజులు ప్రిపేర్ కావాలి.
- నిఖిల, నిజామాబాద్ జిల్లా
సర్కారు న్యాయం చేయాలి
మాది పేద కుటుంబం. సర్కారు జాబ్ కోసం ప్రైవేటు ఉద్యోగం మానేసి, మూడేండ్లుగా హైదరాబాద్ అశోక్ నగర్ లో ప్రిపేర్ అవుతున్న. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంతో రెండుసార్లు గ్రూప్1 ప్రిలిమ్స్ రద్దు అయింది. ఎలాగైనా జాబ్ వస్తుందనే నమ్మకంతో అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్న. రెండు సార్లు పరీక్ష రాసి నష్టపోయిన అభ్యర్థులందరికీ ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలి.
- ఉపేందర్, యాదాద్రి జిల్లా