TSSPDCL జూనియర్ లైన్ మెన్ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. వెయ్యి పోస్టులకు జూలై 17న రాత పరీక్ష జరిగింది. ఎగ్జామ్లో 181 మంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్ పాల్పడినట్లు హైదరాబాద్, రాచకొండ పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది.
సెల్ ఫోన్ తెచ్చుకుని పరీక్ష రాసిన అభ్యర్థి..
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లోని ఓ పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి సెల్ఫోన్ తెచ్చుకొని ఎగ్జామ్ రాస్తూ పట్టబడ్డాడు. దీంతో మాల్ ప్రాక్టీస్ వెలుగులోకి వచ్చింది. అదే టైంలో తమకు సమాధానాలు చెబుతామని లక్షలు తీసుకుని మోసం చేశారని కొందరు ఉద్యోగులపై ఓ అభ్యర్ధి అంబర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీటిపై విచారించిన రాచకొండ పోలీసులు షాకింగ్ నిజాలను బయటపెట్టారు.
ఐదుగురు ఉద్యోగులు అరెస్ట్..
జూనియర్ లైన్మెన్ పరీక్ష అక్రమాల్లో ఇంటి దొంగల బండారం బయటపడింది. ఇద్దరు ADEలు సహా ఐదురుగు ఉదోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చినప్పటికీ.. ఇందులో పాత్ర ఉన్న ఐదుగురు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. శాఖాపరమైన చర్యలు ఆదేశించింది.
సమాధానాలు చెప్పేందుకు అభ్యర్థులతో ఒప్పందం..
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జూనియర్ లైన్మెన్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు సమాధానాలు చెప్పేందుకు ఈ ముఠా ఒప్పందం కుదుర్చుకున్నట్టు పోలీసులు తేల్చారు. వారిలో ఇప్పటికి 181 మంది మాత్రమే వెలుగులోకి వచ్చారు. అయితే ఇంకా చాలా మంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కారణాలతో పరీక్షను రద్దు చేసిన ప్రభుత్వం..త్వరలో కొత్త నోటిఫికేషన్ ప్రకటిస్తామని వెల్లడించింది.