తిరుమలలో ఆక్టోపస్‌ క్యూఆర్ ఛాంబర్‌ ఏర్పాటు

తిరుమలలో ఆక్టోపస్‌  క్యూఆర్ ఛాంబర్‌ ఏర్పాటు

తిరుమలలో శ్రీవారి ఆలయ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. శ్రీవారి ఆలయ ప్రవేశ మార్గంలోని బయోమెట్రిక్‌ సమీపంలో ఆక్టోపస్‌ క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌ (క్యూఆర్‌) ఛాంబర్‌ ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆలయ ప్రవేశమార్గం దగ్గర ఏర్పాటు చేసే ఛాంబర్‌లో ఐదు నుంచి ఆరుగురు సభ్యుల ఆక్టోపస్‌ టీమ్ ఉంటుంది. ఒక సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో.. శ్రీవారి ఆలయ ముఖద్వారాన్ని రక్షిస్తారు. లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుమలలో భద్రతను మరింత పెంచేందుకు నెల క్రితం సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహించారు పోలీసు ఉన్నతాధికారులు. సెక్యూరిటీ పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు.  

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. గురువారం (జులై 6) నాడు టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం (జులై 5) స్వామివారిని 77,299 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 30,479 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.