అక్రిడిటేషన్ కార్డులకు, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా అక్రిడిటేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియా కార్డు దారులకు కూడా వర్తిస్తుందని ఈ విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావద్దని అన్నారు. జీవో 252లో మార్పులు చేసి లిఖితపూర్వకంగా ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి.
మంగళవారం ( డిసెంబర్ 30 ) సచివాలయంలో తనను కలిసిన డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించి వారి సందేహాలను తీర్చారు మంత్రి పొంగులేటి. కొంతమంది అపోహలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని... మీరు వాటిని నమ్మకండని అన్నారు. ఎలాంటి పక్షపాతం లేదు. మీరెవరూ ఆందోళన చెందొద్దు. మీతో నేనున్నానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులను రెండు విభాగాలుగా చూడాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని... ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమ పధకాలను వర్తింపచేస్తామని అన్నారు.
అర్హులైన, నిజమైన జర్నలిస్ట్లకు మేలు చేయాలన్న సంకల్పం, సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయమని... తెలంగాణ రాష్ట్రంలో మినహా దేశంలో ఇంత పెద్దమొత్తంలో అక్రిడిటేషన్ కార్డులు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని అన్నారు మంత్రి పొంగులేటి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జర్నలిస్ట్ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని ఆ సమావేశానికి డెస్క్ జర్నలిస్ట్లను కూడా ఆహ్వానిస్తామని అన్నారు. అందరి అభిప్రాయాలను, సలహాలను సూచనలను తీసుకొని జర్నలిస్ట్లకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా జీవో 252లో మార్పులు, చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి.
