- రంగారెడ్డిలో 77,790 మంది.. మేడ్చల్లో 72,295
హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) రాయబోయే అభ్యర్థుల సంఖ్యలో హైదరాబాద్ శివారు జిల్లాలే టాప్లో నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 2,37,754 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతుండగా, ఇందులో సగానికి పైగా కేవలం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నుంచే ఉన్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా అభ్యర్థులు, పరీక్షా కేంద్రాల వివరాలను విద్యాశాఖ సోమవారం వెల్లడించింది.
కాగా, జనవరి 3 నుంచి టెట్ ఎగ్జామ్ మొత్తం 97 పరీక్షా కేంద్రాల్లో ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష జరగనున్నది. జిల్లాల వారీగా చూస్తే.. రంగారెడ్డి జిల్లా నుంచి అత్యధికంగా 77,790 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వీరి కోసం 20 సెంటర్లను కేటాయించారు. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 23 సెంటర్లు ఏర్పాటు చేయగా, 72,295 మంది పరీక్ష రాయనున్నారు. ఖమ్మం జిల్లాలో 20 వేల మందికి పైగా, హనుమకొండలో 18 వేల మంది, కరీంనగర్లో 16 వేల మంది అభ్యర్థులు ఉన్నారు.
