
- సిటీలోని వేర్వురు చోట్ల ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్..5 కిలోల గంజాయి స్వాధీనం
మేడ్చల్, వెలుగు : గ్రేటర్ పరిధిలో రోజూ ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. మంగళవారం కాలేజీ విద్యార్థులను టార్గెట్చేసి గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శామీర్పేట మండలం దేవరయాంజల్లో ఒడిశాకు చెందిన శంకర్బాగ్, సిబాకిలా అనే వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో మంగళవారం ఎక్సైజ్ ఎస్ఐ ఎం.నవనీత తన సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు.
మేడ్చల్ ఇండస్ట్రీయల్ ప్రాంతాలు, ఇంజనీరింగ్ కాలేజీల వద్ద గంజాయి అమ్మకాలు చేస్తున్నట్టు విచారణలో తేలింది. ఇద్దరిని అరెస్టు చేసి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, నిల్వపై సమాచారం ఇవ్వాలంటే 8712659740, 9192019684,7093755115కు కాల్ చేయాలని సూచించారు. సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, డీపీఈవో షేక్ఫయాజుద్దీన్, ఏఈఎస్ మాధవయ్య అభినందించారు.
ఈజీగా మనీ సంపాదించాలని..
ఘట్ కేసర్: ఈజీగా మనీ సంపాదించాలని గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకులను, వారికి సరఫరా చేసే మరో మహిళను ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జె రవి తెలిపిన ప్రకారం..ఘట్ కేసర్ టౌన్ లోని రాఘవేంద్ర హోటల్ ఎదురుగా గల్లీలో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు అక్కడికి వెళ్లారు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా 500 గ్రాముల ఎండు గంజాయి దొరికింది.
నిందితులను టౌన్ లోని బాలాజీ నగర్ కు చెందిన సయ్యద్ సమీర్(24), యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం, నెమరగోములకు చెందిన వల్లపు గణేష్(19)గా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. ధూల్ పేటలోని బడా బంగ్లాకు చెందిన రాజ్ కుమారి బాయి వద్ద గంజాయిని కొనుగోలు చేసి స్థానికంగా ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు చెప్పారు. దీంతో రాజ్ కుమారి బాయి(48) ను అదుపులోకి తీసుకొని1.6 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ 77, 500 ఉంటుంది. ముగ్గురు నిందితులను రిమాండ్ తరలించినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు