అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
  • హనుమకొండ జిల్లాలో ఒకరు, జనగామ జిల్లాలో మరొకరు

హసన్ పర్తి/రఘునాథపల్లి, వెలుగు: అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట గ్రామానికి చెందిన సందెల చందర్ (36) , అదే గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి మహేందర్‌‌రెడ్డికి సంబంధించిన భూమిని గత నాలుగేండ్లుగా కౌలుకు తీసుకొని, సాగు చేసుకుంటున్నాడు. వ్యవసాయ ఖర్చుల కోసం పలువురి వద్ద చందర్‌‌ రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. అయితే, పంట దిగుబడి సరిగా రాకపోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కౌలు భూమి వద్ద పురుగుల మందు తాగాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

మరోవైపు, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామానికి చెందిన ఒరికుప్పల యాదగిరి (65) తనకున్న నాలుగెకరాల్లో గతేడాది పత్తి వేశాడు. అయితే, పంట దిగుబడి అనుకున్నంతగా రాలేదు. దీంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు రూ.2 లక్షలకు పెరిగింది. వీటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురైన యాదగిరి సోమవారం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో పడిఉన్న యాదగిరిని గుర్తించిన స్థానికులు అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి, చికిత్స కోసం జనగామ జిల్లా హస్సిటల్ తరలించారు. ఈ క్రమంలో చికిత్స పోందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు.