కూలి అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు

కూలి అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు

చిత్తూరు: మదనపల్లెలో యజమాని దాష్టీకానికి ఇద్దరు అమాయకులు చనిపోయారు. ట్రాక్టర్ డ్రైవర్ కూలి డబ్బులు అడిగాడని ఓనర్ చంద్ర నాయక్ అదే ట్రాక్టర్ తో తొక్కించి చంపేశాడు. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు నాగభూషణం అనే మరో వ్యక్తి చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుంగనూరు మండలం కృష్ణా పురానికి చెందిన హరిబాబు రెండేళ్లుగా కూలీ పనులకు వెళ్తున్నాడు. అనారోగ్యం కారణంగా పనికి రాలేనని చెప్పి తన జీతం డబ్బులివ్వాల్సిందిగా యజమాని చంద్రానాయక్ ను అడిగితే .. డబ్బులు ఇవ్వకుండా మొండికేశాడు.

ఈ విషయంలో ఆదివారం ఇద్దరికీ వాగ్వాదం జరగడంతో చంద్రానాయక్ పట్టరాని ఆవేశంతో ఒక్కసారిగా హరిబాబును ట్రాక్టర్ తో బలంగా ఢీకొట్టాడు. హరిబాబుతో పాటు అడ్డుకోబోయిన నాగభూషణం కూడా చనిపోయాడు. దీంతో చంద్రానాయక్ అక్కడి నుంచి పరారై స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. రూరల్ సీఐ రమేశ్, ఎస్ఐ దిలీప్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించి, ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే నవాజ్ బాష మృతుల కుటుంబీకులను పరామర్శించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.