హైదరాబాద్, వెలుగు: దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతున్నదని, దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని పంచాగ శ్రవణ కర్త సూర్యనారాయణమూర్తి తెలిపారు. తన పంచాంగం.. రాజకీయ పంచాంగ శ్రవణం కాదన్నారు. ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన పంచాగ శ్రవణం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి గురువు అనుగ్రహం ఉంటుందన్నారు. తమ శక్తిమేర ప్రజల కోసం ఖర్చు చేయాలని, మంచి పేరు వస్తుందని సూచించారు. పంచాంగం ప్రకారం.. వృద్ధుల సహకారం ఉంటేనే యువకులు విజయం పొందుతారని స్పష్టం చేశారు. మకరం, ధనస్సు, కుంభరాశుల వారికి ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఉందని, కర్కాటక, సింహం, వృశ్చిక రాశుల వారికి అష్టమ శని నడుస్తోందని చెప్పారు. దేశంలో తెల్లని పంటలు బాగా పండుతాయనీ, ఆహార ధాన్యాల ధరలు నిలకడగా ఉంటాయని తెలిపారు. సకాలంలో వర్షాలు కురుస్తాయని, దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.
కేంద్రంలో పేదలకు మేలు చేసే ప్రభుత్వం
కేంద్రంలో మోదీ నాయకత్వంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందని పంచాంగం తెలిపినట్టు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. కేంద్రంలో మరోసారి పేదలకు మేలు చేసే ప్రభుత్వం రాబోతున్నదని అన్నారు. హిందువులంతా ఉగాది నుంచి వచ్చే ఉగాది దాకా ప్రతీ కార్యక్రమాన్ని పంచాంగం ఆధారంగానే నిర్ణయించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ తదితరులు పాల్గొన్నారు.