పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పద్మారావునగర్లోని హమాలీ బస్తీలో ఉగాదిని పురస్కరించుకుని గురువారం బలప్రదర్శన పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా సాగాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన కూలీలు తమ స్వగ్రామ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఏటా ఈ క్రీడలను నిర్వహిస్తున్నారు.
స్థానిక ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో యువకులు 120 కిలోల బరువున్న గుండ్రటి బండరాయిని భుజంపైకి ఎత్తి తమ బలాన్ని చాటారు. ఈ ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజయ్, హనుమదాస్, ఖలీల్, శ్రీనివాస్లను బస్తీ నాయకులు శాలువాలతో సన్మానించారు.
