మహేశ్వరా.. మజాకా..! చౌటుప్పల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్  నుంచి నామినేషన్..

మహేశ్వరా.. మజాకా..! చౌటుప్పల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్  నుంచి నామినేషన్..
  • రెండు పార్టీల నుంచి బీఫాంలు
  • బీఆర్ఎస్  బీఫాం దగ్గర పెట్టుకొని కాంగ్రెస్  బీఫాం సమర్పణ
  • బీఆర్ఎస్, కాంగ్రెస్  వర్గీయుల మధ్య ఘర్షణ

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ మున్సిపాలిటీ బరిలో నిలిచిన ఒక అభ్యర్థికి బీఆర్ఎస్, కాంగ్రెస్​ బీఫాం ఇచ్చాయి. సదరు అభ్యర్థి బీఆర్ఎస్​ బీఫాం తన వద్ద ఉంచుకొని కాంగ్రెస్​ బీఫాంను అధికారులకు అందజేశారు. కాంగ్రెస్​లో కొనసాగుతున్న చింతల ఉమామహేశ్వరి చౌటుప్పల్​ మున్సిపాలిటీలోని 17 వార్డు టికెట్​ ఆశించారు. ఆ పార్టీ సానుకూలంగా లేకపోవడంతో బీఆర్ఎస్​ను సంప్రందించారు. ఆ పార్టీ నుంచి కూడా తొలుత స్పష్టమైన హామీ రాకపోవడంతో బీఆర్ఎస్​, కాంగ్రెస్​తో పాటు ఇండిపెండెంట్​గా మూడు నామినేషన్లు దాఖలు చేశారు. 

బీఆర్ఎస్​ నుంచి హామీ  రావడంతో రెండ్రోజుల కింద భర్త సాయిలుతో కలిసి ఆ పార్టీలో చేరారు. బీఫాం కూడా ఇచ్చేశారు. బీఆర్ఎస్  నుంచి నామినేషన్​ వేసిన మల్లమ్మ అనే మహిళ, ఇంటర్నల్​ అవగాహనతో ఉండడంతో బీజేపీ నుంచి నామినేషన్​ వేసిన శ్రావణి కూడా విత్​ డ్రా చేసుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్​ నుంచి ఆఫర్​ రావడంతో పాటు బీఫాం తీసుకున్న ఉమమహేశ్వరి కాంగ్రెస్​లో చేరుతున్నట్లు ప్రకటించి, బీఫాం దాఖలు చేశారు. 

దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్​ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.