ఎంఎంటీఎస్, మెట్రో, బస్టాప్ ల లింక్.. మూడింటినీ కలిపేందుకు స్కైవాక్లు...

ఎంఎంటీఎస్, మెట్రో, బస్టాప్ ల లింక్.. మూడింటినీ కలిపేందుకు స్కైవాక్లు...

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​లో ట్రాఫిక్​సమస్య పరిష్కరించడంతో పాటు పబ్లిక్​ట్రాన్స్​పోర్టేషన్​ను బలోపేతం చేసేందుకు హెచ్ఎండీఏలోని ఉమ్టా మరో కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ఎంఎంటీఎస్, మెట్రో రైల్, బస్​స్టేషన్లను లింక్​చేయడమే ఆ ఆలోచన. ప్రయాణికులు రోడ్డుపైకి రాకుండా ఈ మూడింటిని కలుపుతూ స్కైవాక్​లను నిర్మించాలని ప్రతిపాదించింది. దీనివల్ల  రోడ్లపై ట్రాఫిక్​సమస్య కొంతవరకు తగ్గుతుందని అంటున్నారు. 

బస్టాప్​లకు దూరంలోనే..

గ్రేటర్​లో 51 మెట్రో స్టేషన్లుండగా, వీటిని కొన్ని చోట్ల ఆనుకుని ఎంఎంటీఎస్​స్టేషన్లున్నాయి. ప్రధానంగా సికింద్రాబాద్, బేగంపేట, నాంపల్లి, భరత్​నగర్, మలక్​పేట, ఖైరతాబాద్​లో మెట్రో, ఎంఎంటీఎస్​స్టేషన్లు పక్కపక్కనే ఉన్నాయి. ఈ స్టేషన్లకు ఆనుకునే బస్టాప్​లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీని కోసం ఆయా శాఖలు సమన్వయంతో వ్యవహరించేలా ఉమ్టా ప్రయత్నిస్తోంది. 

ప్రస్తుతం గ్రేటర్​లో బస్టాప్​లకు 500 మీటర్ల దూరంలో 21 ఎంఎంటీఎస్​స్టేషన్లు ఉండగా, 500 మీటర్లకు మించి కిలోమీటర్​దూరంలో 12, కిలోమీటర్​ఆ పై దూరంలో 18 స్టేషన్లున్నాయి. ఇందులో 500 మీటర్ల నుంచి కిలోమీటర్​కు పైగా దూరంలో ఉన్న బస్టాప్​లను తరలించి ఎంఎంటీఎస్​స్టేషన్​కు దగ్గరలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. 

వాహనాలతో 70 లక్షల మంది 

ప్రయాణికుల సంఖ్య ప్రకారం చూసుకుంటే ఎంఎంటీఎస్​లో రోజుకు 40 నుంచి 50వేల మంది జర్నీ చేస్తుండగా, మెట్రోలో రోజుకు దాదాపు 5లక్షల మంంది, ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 25 లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నట్టు అధికారుల నివేదిక వెల్లడించింది. వ్యక్తిగత వాహనాలతో రోడ్ల పైకి రోజుకు 70 లక్షల మంది వస్తున్నారు. ఎంఎంటీఎస్​, మెట్రో, బస్​స్టేషన్లను అనుసంధానం చేస్తే అధిక శాతం మంది ప్రజా రవాణానే వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. 

లింక్​ కోసం స్కైవాక్​లు 

రోజూ పనుల కోసం నగర రోడ్లపైకి వచ్చే వారు ఎంఎంటీఎస్, మెట్రో, బస్సు ఇలా ఏది ఎక్కినా లాస్ట్​డెస్టినీ వరకూ పబ్లిక్​ట్రాన్స్​పోర్టేషన్​అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులు అనుకుంటున్నారు. ఉదాహరణకు ఎంఎంటీఎస్​ఎక్కిన వ్యక్తి రోడ్డుపైకి రాకుండా నేరుగా బస్​స్టేషన్​లోకి వెళ్లి అక్కడి నుంచి గమ్యానికి వెళ్లేలా ఉండాలంటున్నారు. మెట్రో ఎక్కినా కిందకు దిగగానే బస్టాప్​ఉండాలి. వీటితో పాటు మెట్రో, ఎంఎంటీఎస్​, బస్టాప్​లను లింక్​చేయడానికి స్కైవాక్​ల నిర్మాణానికి ప్లాన్​చేస్తున్నారు. 

ప్రస్తుతం సికింద్రాబాద్​స్టేషన్​దగ్గర ఎంఎంటీఎస్, మెట్రో, బస్టాప్​లు పక్క పక్కనే ఉండడం వల్ల ముందుగా ఇక్కడ స్కైవాక్​కట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ స్కైవాక్​లతో ట్రాఫిక్​ సమస్యకు చెక్​ పెట్టవచ్చంటున్నారు. మెట్రోరైల్​సెకండ్​ఫేజ్​లోనూ ఎంఎంటీఎస్​, బస్​స్టేషన్లను కలుపుతూ మెట్రోస్టేషన్లను ఏర్పాటు చేస్తే స్కైవాక్​ నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.