అల్లుడి మరణ వార్త విని మామ గుండెపోటుతో మృతి

అల్లుడి మరణ వార్త విని మామ గుండెపోటుతో మృతి

అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసిన అల్లుడు ఆస్పత్రిలో చికిత్స ఫలించక చనిపోగా.. ఈ మరణవార్త విన్న ఆయన మామ కూడా గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశాడు. ఒకే కుటుంబంలో మామా అల్లుళ్ల మరణ వార్త స్థానిక గ్రామాలను విషాదంలో ముంచెత్తింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కుందన వాణి పల్లి గ్రామంలో సంపత్ రెడ్డి అనే రైతు అప్పుల బాధతో నాలుగు రోజుల క్రితం తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో పడిపోయిన సంపత్ రెడ్డిని స్థానికులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అల్లుడు మృతి చెందాడన్నవార్త విన్న అతని మామ వెంటనే కుప్పకూలి కన్నుమూశాడు. సంపత్ రెడ్డి మామ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గా రెడ్డి పల్లి గ్రామ వాసి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కుందనపల్లి గ్రామంలో నివసిస్తున్న అల్లుడు ఏలేటి సంపత్ రెడ్డి స్వయానా అల్లుడు. అల్లుడు తన రెండెకరాల వరి పొలం ఎండిపోతుండడంతో రెండు బోర్లు వేయగా అవి ఫెయిల్ అయ్యాయి. బోర్లలో నీళ్లు పడకపోవడంతో  అప్పుల పాలై కుమిలిపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురై నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు. అల్లుడు ఆస్పత్రి నుంచి తిరిగొస్తాడని ఎంతో ఆశతో కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తుండగా.. శనివారం చనిపోయాడు. ఈ విషయం తెలియడంతో మామ  గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. ఇద్దరి మరణ వార్తలతో గ్రామంలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి.