కోచింగ్ కోసం సిటీకి వస్తున్న నిరుద్యోగులు

కోచింగ్ కోసం సిటీకి వస్తున్న నిరుద్యోగులు

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​కొలువుల ప్రకటన నేపథ్యంలో పోటీ పరీక్షలకు కోచింగ్​తీసుకునేం దుకు నిరుద్యోగులు సిటీ బాట పట్టారు. దీంతో కోచింగ్​సెంటర్ల ఏరియాల్లోని హాస్టళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. చిక్కడపల్లి, దిల్ సుఖ్ నగర్​ లాంటి ఏరియాల్లో ఖాళీలే ఉండట్లేదు. కొన్ని హాస్టళ్లలో కెపాసిటీని మించి బెడ్స్ అరేంజ్​చేస్తుండగా,  ఇదివరకు ఉండి వెళ్లిన వాళ్లకు కూడా బెడ్స్​ఖాళీగా లేవు. నిర్వాహకులు పెంచిన ఫీజులను భరించలేకపోతున్నారు. రూమ్ లను అద్దెకు తీసుకొని ఫ్రెండ్స్ తో షేరింగ్ లో ఉంటూ ప్రిపేర్​అవుతున్నామని పలువురు అభ్యర్థులు చెప్పారు.  కోచింగ్​సెంటర్ల ఏరియాల్లోని ఇండ్లలో  మొన్నటి వరకు  సింగిల్​ బెడ్రూమ్​కు నెలకు రూ.5 వేల అద్దె ఉండగా, ప్రస్తుతం రూ.9 వేల వరకు పెంచేశారు.  కోచింగ్​సెంటర్లకు కిలోమీటర్ వరకు అద్దెలు ఇలాగే ఉంటున్నాయి. కరోనా తో ఇండ్లు ఖాళీ చేసి  వెళ్లగా రెండేండ్లుగా నష్టపోయామని, డిమాండ్​ఉందనే అద్దెలను పెంచినట్లు పలువురు ఓనర్లు చెప్పారు. 

డిమాండ్ మేరకే..

కరోనాతో నష్టాలు ఎదుర్కొన్న హాస్టళ్ల నిర్వాహకులు పోటీ పరీక్షల సీజన్​ అనుకుని ఒక్కసారిగా ఫీజులు పెంచేశారు.  హాస్టళ్ల లో సింగిల్ రూమ్ నెలకు రూ.5 నుంచి రూ.6 వేలు ఉండగా, ప్రస్తుతం హాస్టల్ ను బట్టి రూ. 8,500 నుంచి రూ.10 వేలు ఉన్నాయి. ముగ్గురు, నలుగురు ఉండే షేరింగ్ రూమ్ లు  మొన్నటి వరకు రూ.3 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.6,500 వసూలు చేస్తున్నారు. కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డామని, అందుకే ఇప్పుడు పెంచాల్సి వచ్చిందని చిక్కడపల్లిలోని ఓ హాస్టల్ నిర్వాహకుడు చెప్పాడు. 

హాస్టల్  దొరక్క రూమ్ తీసుకున్నం 

కోచింగ్ కు సిటీకి వచ్చి చిక్కడపల్లిలో హాస్టల్​లో ఉందామని అనుకున్నాం. కానీ సరైన హాస్టల్​ దొరకలేదు.  మిగతా వాటిలో షేరింగ్​ రూమ్స్​ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వాటికి కూడా ఫీజు ఎక్కువగా ఉండటంతో బయట రూమ్ తీసుకొని ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నం. రెంట్లు కూడా చాలా పెరిగాయి.   మా ఫ్రెండ్స్​ గతంలో  ఉన్న ఇంటి రెంటు రూ.5 వేలు ఉండగా, ఇప్పుడు రూ.8 వేలు తీసుకుంటున్నారు. తప్పనిపరిస్థితుల్లో ఉంటున్నం.  

:: వినోద్​కుమార్, భద్రాద్రి కొత్తగూడెం