ఆరోగ్యానికి మెడిటేషన్‭తో పాటు ఫిట్‭నెస్ కూడా ముఖ్యం: అనురాగ్ ఠాకూర్

ఆరోగ్యానికి మెడిటేషన్‭తో పాటు ఫిట్‭నెస్ కూడా ముఖ్యం: అనురాగ్ ఠాకూర్

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చెగుర్ కన్షా శాంతివనంలో 1600 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం గొప్పవిషయమని.. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఆరోగ్యానికి మెడిటేషన్ తో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు. శాంతివనంలో నిర్మించిన ఈ క్రీడా ప్రాంగణాన్ని అనురాగ్ ఠాకూర్ తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్, బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ప్రారంభించారు. అనంతరం కన్హా గ్రీన్ 2కే రన్ లో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఆ తర్వత 11 దేశాలకు సంబంధించిన 22 మందికి యోగా అంబాసిడర్‭లుగా సర్టిఫికేట్లు అందజేశారు. 

క్రీడల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మెంటల్ ఫిట్‭నెస్ కోసం యోగా, ఫిజికల్ ఫిట్‭నెస్ కోసం క్రీడలు రెండూ ఒకే చోట ఏర్పాటు చేయడం.. అద్భుతమని చెప్పారు. కామన్వెల్త్ లో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచిందన్నారు. గ్రామీణ యువత సైతం క్రీడల్లో రాణించాలని మండలానికి ఒక స్టేడియం నిర్మిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఆటలకోసం ఇంత పెద్ద ప్రాంగణం నిర్మించడం సంతోషమని బ్యాట్మింటన్ కోట్ పుల్లెల గోపిచంద్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల పట్ల యువతను బాగా ప్రోత్సహిస్తున్నాయన్నారు. గత పదేళ్ళలో పిల్లల తల్లిదండ్రులు కూడా క్రీడల వైపు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన చెప్పారు.