కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. అలాంటి వారిని కాల్చేయండి

కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. అలాంటి వారిని కాల్చేయండి

కేంద్రమంత్రి అశ్విని చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను కీర్తిస్తూ నినాదాలు చేస్తున్న వారు కనిపిస్తే కాల్చేయాలన్నారు.   బిహార్‌ రాష్ట్ర రాజధాని పాట్నా జిల్లాలో  ప్రార్థనా సంఘం వద్ద ఒక వ్యక్తి అతీక్‌కు మద్దతుగా, ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ లకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంఘటనపై చౌబే మండిపడ్డారు.

‘‘జుమ్మా నమాజ్ చేసిన తర్వాత వారిలో ఒకరు ‘అతిక్ అహ్మద్ అమర్ రహే’ అని అరిచాడు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేసాడు’’ అని పాట్నా సిటీ ఎస్పీ వైభవ్ శర్మ తెలిపారు. ఈ విషయంపై మంత్రి అశ్విని చౌబే ఆగ్రహం వ్యక్తం చేసి మాట్లాడారు. ఈ సంఘటన చాలా విచారకరం. బీహార్‌లో ఇటువంటి ప్రకటనలు, నినాదాలు చేయడం దురదృష్టకరం. అలాంటి వారిని వెంటనే కాల్చివేయాలన్నారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ప్రధాని మోడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై ‘‘దేశ ప్రధానికి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పేర్లు పెట్టుకుని నినాదాలు చేసిన తీరు కూడా చాలా దురదృష్టకరం’’ అని అన్నారు. అదే సమయంలో బిహార్ ప్రభుత్వంపై అశ్విని చౌబే విమర్శలు గుప్పించారు. టెర్రరిజం, మాఫియా వంటి నేరస్థులను విడిచిపెట్టని ‘యోగి’ మోడల్ బీహార్‌లో మనకు అవసరమన్నారు. బీహార్‌లో కేవలం మామ-మేనల్లుడి వంశం, కులవివక్ష ప్రభుత్వం నడుస్తోందని అశ్విని చౌబే విమర్శించారు.  

బీజేపీని టార్గెట్ చేస్తూ సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటనలు చేస్తున్నారని.. 2025లో రాష్ట్రంలో యోగి మోడల్‌ను ఎంచుకుని ప్రజలే వారికి సమాధానం చెబుతారంటూ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో బీహార్ ప్రజలు యోగి మోడల్‌ను అధికారంలోకి తీసుకువస్తారని.. బీహార్‌లో కూడా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.