
హైదరాబాద్, వెలుగు: గురుకుల విద్యాలయాలకు రూపొందించిన కొత్త టైమ్ టేబుల్ను కుదించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు పనివేళలు రూపొందించడంతో టీచర్లు.. నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
కొత్త టైమ్టేబుల్ ప్రకారం పిల్లలకు టిఫిన్, రాత్రి భోజనం, క్రీడలు, వ్యాయామాలు, వ్యక్తిగత పరిశుభ్రత, ముఖ్యంగా నిద్రించడానికి తగినంత సమయం దొరకదని, విద్యార్థులు ఇబ్బందులు పడుతారని తెలిపారు. గురుకులాలో సిబ్బందికి క్వార్టర్లు లేవని, చాలా గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆయన తెలిపారు. రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు. ఇక వార్డెన్ల పోస్టులు మంజూరైనా భర్తీ చేయకపోవడం బాధాకరమని, తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని బండి డిమాండ్ చేశారు.