ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే : భూపేందర్ యాదవ్

ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే : భూపేందర్ యాదవ్
  • పాకాల సరస్సు పరిరక్షణపై ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. గోదావరి నదీ తీరాల్లోని ఇసుక అక్రమ తవ్వకాలు, నష్టాన్ని సమగ్రంగా బేరీజు వేస్తున్నామని చెప్పారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, పాకాల సరస్సు పరిరక్షణపై సోమవారం లోక్ సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. నదుల పరిరక్షణ, ఇసుక అక్రమ తవ్వకాలు తదితర అంశాల్లో రాష్ట్రాలకు కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. 

అయితే, సెక్షన్ 15, సెక్షన్ 23సీ ప్రకారం, ఇసుకతో సహా చిన్న ఖనిజాల అక్రమ మైనింగ్‌‌‌‌ను నియంత్రించే, పర్యవేక్షించే, నిరోధించే అధికారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) వివరాల ప్రకారం... గోదావరి నది ఒడ్డున ఇసుక అక్రమ తవ్వకాల గురించి ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. అక్రమ మైనింగ్​ను అరికట్టేందుకు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మైనింగ్ నిఘా వ్యవస్థను అభివృద్ధి చేసిందని వివరించారు. 

తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం.. నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియా కింద వరంగల్ ప్రాంతంలో ఎటువంటి అటవీకరణ ప్రాజెక్టులు చేపట్టలేదని వెల్లడించారు.  జాతీయ నీటి పర్యవేక్షణ కార్యక్రమం కింద ప్రతినెలా పాకాల సరస్సు నుంచి నీటి నమూనాలు సేకరిస్తున్నట్టు సభలో పేర్కొన్నారు.