గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగురటమే మనందరి లక్ష్యం

గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగురటమే మనందరి లక్ష్యం
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు సీనియర్ ఐఏఎస్ అధికారులే చెబుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జ‌రిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మార్పు బీజేపీకే అనుకూలమని అర్థమవుతోందని, మొన్నటి వరకు ఫోన్లు మాట్లాడటానికే బయపడిన ఉన్నతాధికారులు ఇప్పుడు నిర్భయంగా మాట్లాడుతున్నార‌న్నారు. సీఎం కేసీఆర్‌కు నీతి , నిల‌కడ అస్సలే లేద‌ని, ఆయ‌న‌ మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ట్రంప్‌కు.. కేసీఆర్, కేటీఆర్‌కు తేడా ఏమీ లేదని, గ్రేటర్‌లో ఓడిన అభ్యర్థులతో కలిసి కేటీఆర్ ప్రారంభోత్సవం చేస్తున్నార‌ని ఆరోపించారు. ‘తెలంగాణలో కుటుంబ పాలన పోవాలి. బీజేపీ ప్రభుత్వం రావాలి. రానున్న రెండేళ్లు తెలంగాణ బీజేపీకి అత్యంత కీలకం. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితి లేదు. వరద బాధితులకు సాయాన్ని నిలిపివేయటం దుర్మార్గమే. ఉచిత నీరు, ఇంటి పన్ను ఎత్తేస్తామన్న గ్రేటర్ ప్రజలు నమ్మలేదు. ఎంఐఎంతో అక్రమ పొత్తు లేకుంటే టీఆర్ఎస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేయకుంటే గ్రేటర్ ఫలితాలు మరోలా ఉండేవి’ అని కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీలో చేరటానికి జ‌నం ఆసక్తి చూపుతున్నారని, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డిలను గెలపించటానికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దామ‌ని పిలుపునిచ్చారు కిష‌న్ రెడ్డి. ‘పోరుగడ్డ వరంగల్ మేయర్ పీఠాన్ని బీజేపీ గెలవటం అనివార్యం. వరంగల్ రింగ్ రోడ్డుకు సగం నిధులను కేంద్రం సమకూర్చింది. వరంగల్, కరీంనగర్‌ను హెరిటేజ్, స్మార్ట్ సిటీస్‌గా కేంద్రం ప్రకటించింది. నాగార్జున సాగర్‌లో బీజేపీ జెండా ఎగురాల్సిన అవసరం ఉంది. బీజేపీలో చేరటానికి ఆసక్తి చూపుతోన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు త్వరగా కాషాయ కండువా కప్పాలి. గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగురటమే మనందరి లక్ష్యం కావాలి’ అని నేతలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు.