సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఎందుకంటే..?

సీఎం రేవంత్  రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఎందుకంటే..?

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిమనోహర్‌లాల్ ఖట్టర్‎ను కలిసి హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం గురించి చర్చించానని కిషన్ రెడ్డి తెలిపారు. మెట్రో మొదటి దశను L&T నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని, అందుకు అన్ని ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలు పూర్తి కావాలన్నారు. లావాదేవీలు పూర్తయిన తర్వాత రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి అంగీకరించిందని కూడా మనోహర్‌లాల్ ఖట్టర్ గుర్తు చేశారని చెప్పారు.

మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం L&T నుంచి తీసుకోవడం, రెండో దశకు సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా కమిటీ ఏర్పాటుచేయడంపై మీతో కలిసి నిర్ణయించారని కూడా కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తనకు చెప్పారని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. 

ఇందుకోసం రాష్ట ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని కోరినట్లు కూడా వివరించారు. కానీ, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను ప్రతిపాదించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇద్దరు అధికారుల పేర్లు పంపి సమావేశ నిర్వహణకు ప్రయత్నం  చేయాలని కోరుతున్నానని అన్నారు. అదేవిధంగా, వేగవంతంగా L&T నుంచి ‘మెట్రో నెట్‌వర్క్‌’ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత మెట్రో రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిందిగా చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నానని అన్నారు.