రామగుండం ఫర్టిలైజర్స్ లో సాంకేతిక సమస్యలు..  యూరియా ఉత్పత్తికి బ్రేక్.. ఇలాగే కొనసాగితే ప్లాంట్ మనుగడకే ముప్పు  

రామగుండం ఫర్టిలైజర్స్ లో సాంకేతిక సమస్యలు..  యూరియా ఉత్పత్తికి బ్రేక్.. ఇలాగే కొనసాగితే ప్లాంట్ మనుగడకే ముప్పు  
  • రోజుల తరబడి ఆర్​ఎఫ్​సీఎల్​ ప్లాంట్​ షట్ డౌన్ 
  • పట్టింపులేని మేనేజ్​మెంట్, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ కరువు

గోదావరిఖని, వెలుగు:పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్​ అండ్​ కెమికల్స్​ లిమిటెడ్(ఆర్ఎఫ్​సీఎల్) ప్లాంట్ లో తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో రోజుల తరబడి షట్​డౌన్​ అవుతూ యూరియా ఉత్పత్తి నిలిచిపోతోంది. ఉత్పత్తి నిలిచిపోవడంతో రైతులకు సకాలంలో యూరియా అందించలేని పరిస్థితి నెలకొంది. 

సాంకేతిక సమస్యలు పునరావృతం అవుతున్నా మేనేజ్​మెంట్​ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు.

ఏడు రాష్ట్రాలకు యూరియా సప్లై..

తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్, తమిళనాడు రాష్ట్రాల రైతులకు అండగా నిలిచేందుకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో యూరియా ప్లాంట్​ను ఏర్పాటు చేశారు. రామగుండం ఫర్టిలైజర్స్​ అండ్​ కెమికల్స్​ లిమిటెడ్(ఆర్ఎఫ్​సీఎల్) ప్లాంట్​లో 2021 మార్చి 22 నుంచి యూరియా తయారీని ప్రారంభించారు. ఈ ప్లాంట్​లో రోజుకు 3,850 మెట్రిక్​ టన్నులు, ఏటా 12.70 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 

జాయింట్​ వెంచర్​గా ఉన్న ఈ ప్లాంట్​లో నేషనల్  ఫర్టిలైజర్స్  లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్) 26 శాతం, ఇంజనీర్స్  ఇండియా లిమిటెడ్(ఈఐఎల్) 26 శాతం, ఫర్టిలైజర్  కార్పొరేషన్  ఆఫ్  ఇండియా లిమిటెడ్(ఎఫ్​సీఐఎల్) 11 శాతం, తెలంగాణ ప్రభుత్వం 11 శాతం, గ్యాస్​ సప్లై చేసే గెయిల్(ఇండియా) లిమిటెడ్ 14.3 శాతం, టెక్నాలజీ సమకూర్చిన హెచ్‌‌టీఎఎస్  కన్సార్టియం 11.7 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 

అమోనియా యూనిట్​ను డెన్మార్క్​కు చెందిన హోల్దోర్​ టాప్సో కంపెనీ, యూరియా ప్లాంట్​ ఇటలీకి చెందిన సైపెం కంపెనీ నెలకొల్పాయి. గుజరాత్​కు చెందిన జీఐటీఎల్​ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించే మల్లవరం నుంచి బిల్వారాకు వెళ్లే పైప్​లైన్​ ద్వారా ఈ ప్లాంట్​కు గ్యాస్​ సప్లై చేస్తున్నారు. ఈ ప్లాంట్​లో నిత్యం సాంకేతిక సమస్యలు వస్తుండడంతో యూరియా ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది.

గత ఏడాది 114 రోజులు షట్​డౌన్

ఆర్ఎఫ్​సీఎల్​ ప్లాంట్​ 2025–26 ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక సమస్యలతో ఐదు సార్లు షట్​డౌన్​ కాగా, 114 రోజుల పాటు ప్లాంట్​లో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. 12.70 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యానికి గాను 8.57 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇలా ప్లాంట్​ షట్​డౌన్​తో 4.13 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా ఉత్పత్తికి బ్రేక్​ పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలల్లో మూడు సార్లు షట్​డౌన్​ అయింది. 

ఏప్రిల్​లో 6 రోజులు, జులై​లో 10 రోజులు షట్​డౌన్​ అయింది. ఆగస్టు 22న షట్​డౌన్​ కాగా, ఇప్పటికీ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5.30 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా ఉత్పత్తి కావాల్సి ఉండగా 4.50 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి జరిగింది. అంటే ఐదు నెలల్లో 80 వేల మెట్రిక్​ టన్నుల యూరియా ఉత్పత్తి లోటు ఏర్పడింది.

ఎందుకీ పరిస్థితి?

జూన్​లో ఆర్ఎఫ్​సీఎల్​ ప్లాంట్​కు గెయిల్​ నుంచి గ్యాస్​ కేటాయింపులు తగ్గగా, జులైలో అమోనియా పైప్​లైన్​ లీకేజీ, ఆగస్టులో అమోనియా విభాగంలో పైప్​లైన్​ హెడ్​ బ్లాస్ట్​ కారణంగా ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ ప్లాంట్​లో స్టీమ్​ పైప్​లైన్​ లీకేజీలతో సహజసిద్ధంగా ప్లాంట్​ షట్​డౌన్​ అయినట్లు తెలుస్తోంది. అయితే అమోనియా విభాగానికి వెళ్లే పైప్​లైన్లను ఈఐఎల్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 

పైప్ లైన్ల ఇన్​స్టాలేషన్​ సమయంలో సరిగా ఎరక్షన్​ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతుందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. దీనికితోడు సహజవాయువును కృత్రిమ వాయువుగా మార్చే హాల్దోర్​ టాప్సో హీట్​ ఎక్స్ఛేంజ్​ రిఫార్మర్(హెచ్​టీఈఆర్) యూనిట్​లో ఈ ఏడాది జనవరిలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో మార్చి 25న ప్లాంట్​ నుంచి ఈ యంత్రాన్ని రిపేర్ల నిమిత్తం ముంబైకి తరలించారు. ఐదు నెలలు గడిచినా ఈ మెషీన్​ను తీసుకురాలేదు.

సీరియస్​ గా తీసుకోని కేంద్రం

ఆర్ఎఫ్​సీఎల్​ మెయిన్​ ఆఫీస్​ నోయిడాలో ఉంది. ప్లాంట్​కు చెందిన ఉన్నతాధికారులంతా నోయిడాలోనే ఉండడం వల్ల రామగుండం ప్లాంట్​లో ఏర్పడే సాంకేతిక సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించే అవకాశం లేకుండా పోతోంది. అందుకే నోయిడాలో ఉన్న ఆర్ఎఫ్​సీఎల్​ మెయిన్​ ఆఫీస్​ను రామగుండం తరలించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గతంలోనే డిమాండ్​ చేశారు. 

అయినా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకోవడం లేదు.  ఆర్ఎఫ్​సీఎల్​ ప్లాంట్​లో సాంకేతిక సమస్యలపై కేంద్రం, మేనేజ్​మెంట్​ ప్రత్యేక దృష్టి సారించకపోతే ప్లాంట్​ మనుగడకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది.