- 7న బడుల్లో, 12, 13 తేదీల్లో మండలాల్లో నిరసనలు
- కార్యాచరణ ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాల నేతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రకటించింది. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుతూ దశలవారీ ఆందోళన చేపట్టనున్నట్టు ప్రకటించింది.
మంగళవారం హైదరాబాద్లో యూఎస్పీసీ నేతలు చావ రవి (యూటీఎఫ్), అనిల్ కుమార్ (టీపీటీఎఫ్), లింగారెడ్డి (డీటీఎఫ్) మీడియాతో మాట్లాడారు. బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలనీ, ప్రీ-ప్రైమరీ తరగతులను కేవలం యూకేజీకే పరిమితం చేయొద్దని కోరారు. ఆగస్టు 15లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆయా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7న అన్ని బడుల్లో లంచ్ బ్రేక్లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని నేతలు పేర్కొన్నారు. ఈనెల12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో, 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపడుతామన్నారు. 29న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నామని, అప్పటికీ సర్కారు స్పందించకపోతే.. సెప్టెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ నేతలు వెంకట్, తిరుపతి, సోమయ్య, కొండయ్య, రాజన్న, రమేష్, చరణ్ దాస్, హరికిషన్, విజయకుమార్, రవీందర్ పాల్గొన్నారు.
