
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర నుంచి సుమారు 9.21 కిలోల బంగారాన్ని పట్టుకున్న పోలీసులు.. దాని విలువ రూ.3,46,48,096 కోట్లుగా ఉంటుదని తెలిపారు. ఆ ప్రయాణికుడు బంగారాన్ని ‘V’ షేప్ లో కత్తిరించి నాలుగు ఇస్త్రీ పెట్టెల్లోని హీటింగ్ కాయిల్ స్థానంలో అమర్చి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. కస్టమ్స్ అధికారులు అతని లగేజీని పూర్తిగా తనిఖీ చేయగా నాలుగు ఇస్త్రీ పెట్టెల్లో నాలుగు కడ్డీలను దాచినట్టుగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
గత నెల 8 న కూడా ఈ ఎయిర్ పోర్ట్ లోనే కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 150 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్కే డిజిటల్ అనే ఓ సంస్థ ఆ బంగారాన్ని మలేషియా నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.