వేములవాడ రాజన్నకి కాసుల వర్షం

వేములవాడ రాజన్నకి కాసుల వర్షం

వేములవాడ, వెలుగు:  రాష్ట్రంలోనే అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి కాసులు కురిశాయి. భక్తులు వివిధ రూపాల్లో వేసిన హుండీలను ఆలయ ఓపెన్​ స్లాబ్​ లో భారీ భద్రత మధ్య సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కించారు. 21 రోజుల్లో  స్వామివారికి 2 కోట్ల 52 లక్షల 29 వేల ఆదాయం వచ్చింది. దానితో పాటు 277 గ్రాముల బంగారం , 13 కిలోల 280 గ్రాముల వెండి కూడా వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.

హుండీ లెక్కింపులో ఆలయ సూపరిండెంట్లు, శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కాగా రేవతి నక్షత్రం, సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో గురువారం అభిషేక పూజలు రద్దు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా రాజన్న ఆలయం సమ్మక్క భక్తులతో కిటకిటలాడుతోంది.