
- తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీస్కుంటం: పొన్నం
- మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తి చేస్తం
- ప్రభుత్వం మారినా.. వర్క్స్ ఆగవని వెల్లడి
కరీంనగర్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్మార్ట్సిటీ, సీఎం అస్యూరెన్స్ ఫండ్స్, 15వ ఫైనాన్స్ గ్రాంట్స్తో చేపట్టిన అభివృద్ధి పనులపై ఎంక్వైరీ జరుగుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎంక్వైరీ రిపోర్టు అందాక తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా ఏండ్లుగా పని చేస్తున్న వారి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
నిబంధనల ప్రకారం బదిలీలు ఉంటాయని స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో మంత్రి మాట్లాడారు. ‘‘సీఎం అస్యూరెన్స్ ఫండ్స్తో చేపట్టిన 80 పనులపై నివేదికలు కోరాం. స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్లో 22 వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేశారు.
వాటి గురించి ప్రజలకు తెలిసేలా చేయాలి. ఎవరైనా భూములు ఆక్రమించి ఉంటే.. పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. అనుమతుల్లేకుండా జరిగిన భవన నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టాలి. వచ్చే వారం నుంచి మున్సిపాలిటీలో వారానికో విభాగంపై కలెక్టర్ సమీక్ష జరపాలి’’అని మంత్రి అన్నారు.
ఫస్ట్ కం ఫస్ట్ రికార్డు ప్రకారం బిల్లుల చెల్లింపు
బల్దియాలో అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఫస్ట్ కం ఫస్ట్ రికార్డు ప్రకారం బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మానేరు రివర్ ఫ్రంట్ ఫస్ట్ ఫేజ్లో 72శాతం పనులు పూర్తయ్యాయని, ఫేజ్ 2 పనుల్లో డ్రైనేజీ సిస్టమ్ చేర్చామని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు.
‘‘ప్రభుత్వం మారినా.. అభివృద్ధి పనులు ఆగవు. అభివృద్ధి పనులకు అంతకంటే ఎక్కువ నిధులే వస్తాయి. ఇందిరా చౌక్ పనుల్లో కోటి 30లక్షల బిల్లు ఉంటే.. 50లక్షలు అదనంగా ఖర్చు చేశారు. దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నది’’అని అన్నారు. మీటింగ్లో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో కే.మహేశ్వర్ పాల్గొన్నారు.