కేటీఆర్‌‌‌‌.. మీ తండ్రికి చెప్పే నడ్డాను సవాల్‌‌‌‌ చేశావా?

కేటీఆర్‌‌‌‌.. మీ తండ్రికి చెప్పే నడ్డాను సవాల్‌‌‌‌ చేశావా?
  •                 అప్పట్లోనూ చాలెంజ్ చేసి, సైలెంట్​అయ్యావుగా! 
  •                 కాంగ్రెస్‌‌‌‌ ప్రచార కమిటీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ విజయశాంతి 

‘‘ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని బీజేపీ నేషనల్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ నడ్డా అంటే.. దమ్ముంటే విచారణ చేయించాలని మీరు సవాల్​చేశారు. కేటీఆర్.. మీ తండ్రికి చెప్పే సవాల్​ చేశావా?” అని కాంగ్రెస్‌‌‌‌ ప్రచార కమిటీ చైర్‌‌‌‌ పర్సన్‌‌‌‌ విజయశాంతి ప్రశ్నించారు. టీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్​ కేటీఆర్ గతంలో ఇంటర్‌‌‌‌ ఫలితాల్లో తప్పులు దొర్లినప్పుడూ ఇలాంటి సవాలే చేశారని ఆమె ఒక ప్రకటనలో గుర్తు చేశారు. గ్లోబరీనా సంస్థకు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పెద్దలతో సంబంధాలున్నాయని అనేక మంది ఆరోపణలు చేశారన్నారు. అప్పుడు చాలెంజ్‌‌‌‌ చేసిన కేటీఆర్‌‌‌‌.. రాష్ట్రపతి రామ్​నాథ్‌‌‌‌ కోవింద్‌‌‌‌ ఈ విషయంలో వివరణ కోరడంతో మౌనంగా ఉండిపోయారని పేర్కొన్నారు. రాష్ట్రపతి సీఎస్‌‌‌‌ను వివరణ కోరడం ప్రతిపక్షాల కుట్ర అని ఇప్పుడు సీఎం కేసీఆర్‌‌‌‌ ఆరోపిస్తున్నారని, ప్రభుత్వాన్ని బద్‌‌‌‌నాం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. రేపు ప్రాజెక్టులపై విచారణ జరిగితే అది కూడా ప్రతిపక్షాల కుట్రే అంటారని అన్నారు. ప్రతిపక్షాలను ఆడిపోసుకునే ముందు తన కొడుకు ఇలాంటి చాలెంజ్‌‌‌‌లు ఎందుకు చేస్తున్నారో కేసీఆర్ అడిగితే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించి, వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఇది రాష్ట్ర ప్రజల డిమాండ్‌‌‌‌ అని ఆమె పేర్కొన్నారు.