
వర్షం మా ఆశలపై నీళ్లు చల్లిందని అసహనం వ్యక్తం చేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇంగ్లండ్ తో ఫస్టు టెస్టు మ్యాచ్ కు చివరి రోజు వర్షం ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్ డ్రా కావడంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందించాడు.గెలిచే స్థితిలో ఉండి కూడా మ్యాచ్ డ్రా కావడం ఆవేదనకు గురి చేసిందన్నాడు. ఇది నిజంగా దురదృష్టకరమని, లక్ష్య ఛేదనలో మేం మంచి స్థితిలో ఉన్నామని అన్నారు. గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నాం కానీ.. మూడో రోజో.. నాలుగో రోజో పడుతుందనుకున్న వర్షం.. ఐదో రోజు పడి మా ఆశలపై నీళ్లు చల్లిందన్నాడు. 209 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు బాగా ఆడారని, అదే జోష్ లో ఐదోరోజు ఆటకు సిద్ధమయ్యామన్నాడు. అప్పటిదాకా బ్యాటింగ్, బౌలింగ్ లో తమదే పై చేయి కానీ.. ఆఖరి రోజు ఆట కొనసాగించలేకపోవడం దురదృష్టమని చెప్పుకొచ్చాడు. ఆ రోజు మొత్తం ఆట ఆడే వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐదోరోజూ ఎడతెరిపిలేని వానతో మ్యాచ్ ను క్యాన్సిల్ చేశారు. అప్పటికి భారత్ కు 157 రన్స్ అవసరం కాగా.. 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. దీంతో భారత్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే అనుకోకుండా మ్యాచ్ డ్రా అయింది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నాటింగ్ హాంలో జరిగిన సంగతి తెలిసిందే.