రోహిత్తో తనకు ఎలాంటి విభేదాల్లేవని, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో ఆడతానని కోహ్లీ స్పష్టం చేయడం గుడ్న్యూస్. కానీ, టీ20 కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ బాస్ గంగూలీ వ్యాఖ్యలను విరాట్ ఖండించడంతో ఈ ఇష్యూ ఇంకో టర్న్ తీసుకుంది. మొన్నటిదాకా కోహ్లీ x రోహిత్గా ఉన్న పరిస్థితి ఇప్పుడు కోహ్లీx బీసీసీఐగా మారింది. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని తాను కోహ్లీని పర్సనల్ రిక్వెస్ట్ చేశానని గంగూలీ చెప్పాడు. వన్డే కెప్టెన్సీని మార్చేముందు కూడా విరాట్తో మాట్లాడానని చెప్పాడు. కానీ, టీ20 కెప్టెన్సీ పునరాలోచన చేయాలని తనను ఎవ్వరూ కోరలేదని, వన్డే కెప్టెన్సీ తొలగించే విషయంలో ముందస్తు సమాచారం ఇవ్వలేదని కోహ్లీ స్పష్టం చేశాడు. మరోవైపు సౌతాఫ్రికాతో వన్డేలకు కోహ్లీ రెస్ట్ అడిగాడని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధూమల్ సహా కొందరు బోర్డు పెద్దలు మీడియాకు చెప్పారు. కానీ, తాను బ్రేక్ కోరలేదని విరాట్ కుండబద్దలు కొట్టాడు. దాంతో, గంగూలీ సహా బీసీసీఐ పెద్దలంతా ఇరకాటంలో పడ్డారు. మొత్తంగా కెప్టెన్సీ మార్పు ఇంత రచ్చగా మారడానికి కారణం ఇరు వర్గాల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే. కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదులుకునే ప్రాసెస్లో తొమ్మిది మంది ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది. ఐదుగురు సెలక్టర్లు, గంగూలీ, జైషా, కోహ్లీ, రోహిత్.. ఆ తొమ్మిది మంది. కానీ, కోహ్లీకి, బీసీసీఐకి మధ్య సరైన కమ్యూనికేషన్ లేక ఎవరు ఏం చెప్పారనేదానిపై క్లారిటీ లేకుండా పోయింది. కోహ్లీ పేరు ప్రస్తావించకుండా కెప్టెన్సీ మారుస్తున్నట్టు ప్రకటన ఇచ్చి బోర్డు కచ్చితంగా పెద్ద తప్పే చేసింది. ఇలా తన కెప్టెన్సీని తొలగించడంపై కోహ్లీ చాలా అసంతృప్తితో ఉన్నాడు. విరాట్ స్థాయి ప్లేయర్ను ఇలా ట్రీట్ చేయడం సరికాదు. ఇప్పుడు బోర్డు బాస్గా గంగూలీనే చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి.
