విశ్వనాథన్ ఆనంద్ ఫస్ట్ స్పాన్సర్ ఎస్పీబీ

విశ్వనాథన్ ఆనంద్ ఫస్ట్ స్పాన్సర్ ఎస్పీబీ
  • ఆనంద్ సక్సెస్  వెనుక బాలు

విశ్వనాథన్ ఆనంద్ .. చెస్ ప్రపంచంలో ఈ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గురించి తెలియని వారుండరు. చెన్నైలో జన్మించిన ఆనంద్ ఐదు సార్లు విశ్వవిజేతగా కూడా నిలిచాడు. ఆనంద్ ఈ స్థాయికి చేరడం వెనుక శుక్రవారం తుదిశ్వాస విడిచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. గాయకుడైన ఎస్పీ బాలుకు, ఆనంద్ కు ఉన్న సంబంధమేంటో తెలియాలంటే 1983 వరకు వెళ్లాలి . అప్పట్లో 13 ఏళ్ల విశ్వనాథన్ ఆనంద్.. మద్రాస్ కోల్ట్స్ (జూనియర్ చెస్ టీమ్ )లో సభ్యుడు. ఐఐటీ బాంబే నిర్వహిస్తున్న నేషనల్ టీమ్ చాంపియన్ షిప్​కు తమ జూనియర్ టీమ్ ను పంపాలని మద్రాస్ డిస్ట్రిక్ట్​ చెస్ అసోసియేషన్ భావించింది . కానీ అందుకు డబ్బులేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకుంది .ఆ టైమ్ లో ముందుకొచ్చిన ఎస్పీ బాలు మద్రాస్ కోల్ట్స్ టీమ్ కు కావాల్సిన ఆర్థిక సాయం చేశారు. అలా ఆనంద్ కు తొలి స్పాన్సర్ అయ్యారు బాలు. ఆరుద్ర రచించిన ఓ పాట రికార్డింగ్ కోసం ఎస్పీబాలు చెన్నైలోని విజయ గార్డెన్స్ స్టూడియోకు వచ్చారు. అప్పుడు గేయ రచయిత ఆరుద్ర కారణం చెప్పకుండా బ్లాక్ చెక్ పై బాలుతో సంతకం చేయించుకున్నారు. ఆ డబ్బును ఆరుద్ర మద్రాస్ కోల్ట్స్ టీమ్ కోసం ఉపయోగించారు. ఎస్పీబీ అందించిన ఆ సహకారంతో టోర్నీబరిలోకి దిగిన ఆనంద్ .. అప్పటి కే తొమ్మిది సార్లు నేషనల్ చాంపియన్ అయిన మౌనిల్ ఆరోన్ ను ఓడించాడు. దాంతో పాటు మద్రాస్ టీమ్ కూడా విజేతగా నిలిచింది . ఆ తర్వాత ఆనంద్ విశ్వవిజేత స్థాయికి చేరాడు. ‘ మద్రాస్ చెస్ అకాడమీ కార్యకలాపాల్లో ఆరుద్ర చురుగ్గా పాల్గొనేవారు. ఆయన చేసిన వినతి మేరకే ఎస్పీ బాలు మాకు స్పాన్సర్ చేశారు. ఆ టోర్నీ నా కెరీర్ నే మలుపు తిప్పింది . ఆ తర్వాత చాలా ఏళ్లకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్​లో ఎస్పీబీని కలిశాను. మాకు స్పాన్సర్ చేసిన విషయం గుర్తుందా అని అడిగితే.. చెయ్యి ఊపుతూ నాకింకా గుర్తింది యంగ్ మన్ .. నేను ఆ పని చేశానంటే చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఆ తర్వాత కూడా మేము ఒకట్రెండు సార్లు ఫ్లైట్, ఎయిర్ పోర్టు​లో కలిశాం. ఆయన సింప్లిసిటీ నన్ను చాలా ప్రభావితం చేసింది .ఎప్పుడు కలిసినా నాతో ఆప్యాయంగా మాట్లాడేవారు. నా బాగోగులు తెలుసుకుంటూ చాలా ప్రేమ చూపేవారు. ఓ తరం మొత్తం ఆయన గానాన్ని ఆస్వాదించింది .ఆయన ఆరోగ్యంగా తిరిగిరావాలని మనస్పూర్తిగా కోరుకున్నా.కానీ గురువారం నుంచే పరిస్థితి తలకిందులైంది . ఆయన ఇక లేరనే విషయం విన్నాక నా హృదయం బద్దలైనంత పనైంది ’ అని విశ్వనాథన్ ఆనంద్ చెప్పాడు.