అమిత్ షా సభను విజయవంతం చేయండి

అమిత్ షా సభను విజయవంతం చేయండి

హైదరాబాద్: ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో  తలపెట్టిన అమిత్ షా సభను అడ్డుకునేందుకు కేసీఆర్ సర్కారు కుట్రలు పన్నుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో గురువారం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు మంచి స్పందన వస్తోందని చెప్పారు. బీజేపీని ఆదరించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. సెప్టెంబర్ 17న బీజేపీ నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వస్తున్నారని, అయితే సిటీలో అమిత్ షా హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టకుండా కేసీఆర్, కేటీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల సిటీలో జరిగిన బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో  కూడా మోడీ ఫోటోలు పెట్టకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు పన్నిందన్నారు. బీజేపీకి పబ్లిసిటీ రాకుండా చేసేందుకు సిటీ మొత్తం తండ్రీకొడుకుల ఫ్లెక్సీలతో నింపేశారని ఫైర్ అయ్యారు.

కేసీఆర్, కేటీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా సభను విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆనాడు నిజాం రాజు హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో కలపబోనని పట్టుబడితే, అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం మెడలు వంచి హైదరాబాద్ ను దేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు. ఎంతో మంది త్యాగాలతో ఏర్పడిన  రాష్ట్రంలో  సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవాలను జరపడంలేదని విమర్శించారు. అందుకే కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని వివేక్ వెంకటస్వామి కోరారు.