ఎస్సైని ఢీకొట్టిన కారులో వోడ్కా, కల్లు బాటిల్.. షాకింగ్ సీసీ టీవీ ఫుటేజ్

ఎస్సైని ఢీకొట్టిన కారులో వోడ్కా, కల్లు బాటిల్.. షాకింగ్ సీసీ టీవీ ఫుటేజ్

ఎస్సై డ్రంక్ అండ్ర డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. అత్యంత వేగంగా కారుతో ఢీకొట్టి పారిపోయిన ఘటన హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆదివారం (జనవరి 25) జరిగిన ఈ ఇన్సిడెంట్ లో ఎస్సై  చచ్చాడో బతికాడో కూడా చూడకుండా డ్రైవ్ చేస్తూ వెళ్లిన దుండగులను పట్టుకున్న పోలీసులు షాకింగ్ నిజాలు కనుగొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఛేజింగ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

ఈ ఘటనకు సంబంధించి యాచారం సీఐ ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. ఎస్సై మధు తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారులో అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టారు దుండగులు. ఆ సమయంలో కారును డ్రైవ్ చేసింది శ్రీకర్ రెడ్డి అనే యువకుడు. అదే సమయంలో కారులు అతని స్నేహితుడు నితిన్ కూడా ఉన్నాడు. కారులో ఓడ్కా బాటిల్, కల్లు సీసాలు దొరకడం చూసి షాకయ్యారు పోలీసులు. తాగిన మత్తులో నిర్లక్ష్యంగా, ఎదుటి వారి ప్రాణాలపై ఎలాంటి సానుభూతి లేకుండా, మానవత్వం మరిచి పోలీసుపైకి కారుతో దూసుకెళ్లారు ఈ దుండగులు. 

అసలేం జరిగింది..?

డ్రంక్‌‌ అండ్‌‌ డ్రైవ్   నిర్వహిస్తున్న ఎస్ఐని ఓ కారు ఢీకొట్టి కీలోమీటర్​ దూరం ఈడ్చుకెళ్లింది. ఆదివారం (జనవరి 25) సాయంత్రం రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో బస్టాండ్​ వద్ద సాగర్​ రహదారిలో ఈ ఘటన జరిగింది. సాగర్  రోడ్డులో యాచారం ఎస్ఐ ఉయ్యాల మధు, సిబ్బంది డ్రంక్​ అండ్​ డ్రైవ్  తనిఖీలు చేపట్టారు. 

ఆ సమయంలో మాల్​ నుంచి హైదరాబాద్​ వైపు వెళ్తున్న​ కారు.. బారికేడ్ల వద్ద ఆగకుండా వెళ్లేందుకు యత్నిస్తుండగా ఎస్సై అడ్డగించారు. దీంతో తప్పించుకునేందుకు ఎస్ఐ ఉయ్యాల మధును కారు ఢీకొట్టగా ఆయన బానెట్​పై పడ్డారు. అయినా కూడా కారు డ్రైవర్  ఆపకుండా అతివేగంగా హైదరాబాద్​ వైపు వెళ్తూ యాచారం చౌరస్తాలో బైక్​ ను ఢీకొట్టింది. దీంతో బైక్​పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ కూడా బానెట్ పై నుంచి జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. 

కారును, అందులో ఉన్న ఇద్దరిని ఇబ్రహీంపట్నం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడకు చెందిన కీసరి శ్రీకర్ రెడ్డి, హయత్ నగర్​కు చెందిన నితిన్‌‌‌‌గా గుర్తించారు. నిందితులకు ఆల్కహాల్ టెస్ట్ చేయగా కారును నడిపిన కీసరి శ్రీకర్ రెడ్డికి 135 ఎంజీ ఆల్కహాల్ శాతం, నితిన్ కు 122 ఎంజీ చ్చినట్లు తెలిసింది. నిందితులపై హిట్​ అండ్​ రన్ ​కింద కేసు నమోదు చేశామని యాచారం సీఐ తెలిపారు.