జోగిపేట మున్సిపల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం
కొత్త లిస్ట్ ప్రింట్ చేయాలని ప్రతిపక్షాల డిమాండ్
సంగారెడ్డి, వెలుగు: ఓటర్ లిస్ట్లోనే ఓట్ ఫర్ కార్ అని ప్రింట్ చేశారు జోగిపేట మున్సిపల్ అధికారులు. ఓ టీఆర్ఎస్ కార్యకర్త పేరు, అడ్రస్తో పాటు టీఆర్ఎస్ కారు గుర్తున్న ఫొటోను అప్లోడ్ చేస్తే ఆఫీసర్లు పరిశీలించకుండా అలాగే ప్రింట్ చేయించి లిస్ట్ తయారు చేయించారు. ఎన్నికల కమిషన్ రూల్స్కు వ్యతిరేకంగా ఉన్న ఈ ఓటర్ లిస్టును మున్సిపల్, రెవెన్యూ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా ప్రింట్ చేయడంపై లోకల్ ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్-జోగిపేట్ మున్సిపాల్టీలోని 16వ వార్డులో ఏసీపీఎస్ నెంబరు30, 695, 511 ఓటరు పేరు నాగరాజు సంగ, తండ్రి శ్రీనివాస్ సంగ ఫొటో కింద ఓట్ ఫర్ కార్ అని టీఆర్ఎస్ పార్టీ కారు బొమ్మ స్పష్టంగా కనిపిస్తోంది. పైగా ఓటర్ లిస్టులో అతని పేరుతో మరో ఐడీ కూడా ఉంది. ఈ విషయమై జోగిపేట మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్ను వివరణ కోరగా రెవెన్యూ ఆఫీసర్ తప్పిదం వల్లే అలా ప్రింట్ అయిందని చెప్పారు. పొరపాటును సరి చేసి కొత్త ఓటర్ లిస్టు ఇస్తామని తెలిపారు.
గత ఎన్నికల్లోను ఇలాగే..
అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలప్పటి ఇదే గుర్తుతో ఓటర్ లిస్టులో నా ఫొటోఉందని ఓటరు నాగరాజు సంగ వివరించారు. అట్లాగే ఓటు వేసినా నన్నెవరూ ఆపలేదని చెప్పారు. ఓటర్ లిస్టులో అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయమని ఉన్న ఫొటోలు ప్రింట్ చేయడంపై కాంగ్రెస్, బీజేపీ మండిపడుతున్నయ్. వెంటనే దాన్ని తొలగించి కొత్త ఓటరు లిస్టు తయారు చేయాలని డిమాండ్ చేశాయి.