ఏపీలో కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్

 ఏపీలో కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో  రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఐదింటివరకు పోలింగ్ కొనసాగనుంది. ఏపీ అసెంబ్లీ కార్యాలయం మొదటి అంతస్తులో ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభం కాగానే...ఏపీ అసెంబ్లీకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి ఓటు వేశారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్, సహచర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, సురేష్, తానేటి వనిత ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల పర్యవేక్షకుడు చంద్రేకర్ భారతి, ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సంతోష్ అజ్మీరాలు నిన్ననే అమరావతి చేరుకుని అసెంబ్లీ ప్రాంగణంలోని ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 174 మంది ఇక్కడ తమ ఓటు వేయనున్నారు. కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి హైదరాబాదులో ఓటు వేయనున్నారు. అసెంబ్లీలో ఉన్న మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో వైసీపీకి 151, టీడీపీకి 23 మంది ఉన్నారు. ఒక ఓటు జనసేనకు ఉన్నా.. ఆయన వైసీపీలో చేరిపోవడంతో ఆయన కూడా ఎన్డీయే అభ్యర్థికే ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ రెండూ ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు ప్రకటించాయి. 
మొత్తం ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చిత్రీకరిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత రేపు బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తరలించనున్నారు. వైసీపీ నేతల పోలింగ్ ముగిసిన తర్వాత.. టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు అసెంబ్లీకి రానుండడం ఒకింత ఉత్కంఠ సృష్టిస్తోంది.