
హైదరాబాద్: తెలంగాణలో గిగ్ వర్కర్లకు ది బెస్ట్ పాలసీ తెస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. తెలంగాణ గిగ్ వర్కర్ పాలసీని దేశానికే రోల్ మోడల్ అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. శుక్రవారం (జూన్ 27) గిగ్ వర్కర్ల సమస్యలపై సంబంధిత అధికారులతో సచివాలయంలో మంత్రి వివేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గిగ్ వర్కర్ల సమస్యలు, వారి నుంచి వచ్చిన సూచనల గురించి అధికారులతో చర్చించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిగ్ కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని.. వాళ్లకు హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గిగ్ వర్కర్ల క్షేమం కోసం అప్పట్లో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చిందని అదే మాదిరిగా తెలంగాణలో కూడా గిగ్ వర్కర్ల కోసం ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్లకు రిజిస్ట్రేషన్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పారు.
యాజమాన్యాలు, గిగ్ వర్కర్ల నుంచి 66 సూచనలు, సలహాలు వచ్చాయని.. వాటిపై చర్చించి ఎలాంటి సాయం చేయాలన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల సమస్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ భారత్ సమ్మిట్లో మాట్లాడారని.. అలాగే గిగ్ వర్కర్లకు న్యాయం చేయాలని సూచించారన్నారు.
గిగ్ వర్కర్ల సమస్యలపై కేబినెట్లో చర్చిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే గిగ్ వర్కర్లతో మాట్లాడారని గుర్తు చేశారు. గిగ్ వర్కర్ల పాలసీపై కేబినెట్లో చర్చించి అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామని తెలిపారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో నాలుగున్నర లక్షల గిగ్ వర్కర్లు ఉన్నారని, కొత్త యాక్ట్ వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.