
- ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడ్తున్నం
- ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి, సంక్షేమం: భట్టి
- 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చినం.. త్వరలో మరో 30 వేలు భర్తీ
- ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలిస్తున్నం
- ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో పడ్డ ఎస్సీ వర్గీకరణ చేసినం
- రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఓ వైపు గాడిలో పెడ్తూనే మరోవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, మరో 30 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నామని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామని వెల్లడించారు. మంగళవారం గాంధీ భవన్లో భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు పీసీసీ పీఏసీ మీటింగ్లో, పీసీసీ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలపై పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) హర్షం వ్యక్తం చేసిందని, ఈ ఏడాదిన్నర ప్రభుత్వ పాలనను గోల్డెన్ పీరియడ్ అని అభినందించిందని భట్టి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలిస్తున్నామని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ చేశామని వెల్లడించారు.
3 నెలల్లోనే రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినం
ఎన్నికల ముందు గత బీఆర్ఎస్ సర్కారు ఒక సీజన్ కు రైతు భరోసా ఎగవేస్తే.. తాము వచ్చి చెల్లించామని భట్టి విక్రమార్క తెలిపారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా, సన్నాలు సాగు చేసిన రైతులకు 500 బోనస్, రైతు బీమా, పంట నష్టం జరిగితే పరిహారం, భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతన్నల కోసం దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన తీరును పీఏసీ సమావేశం అభినందించిందని వెల్లడించారు.
ఈ సీజన్లో పెట్టుబడి సాయం కింద తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలో జమచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 8,675 కోట్లు వేశామని తెలిపారు. రైతు భరోసాతో రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు సంబంధించి 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 9 వేల కోట్లు జమచేసి.. రైతుల కుటుంబాల్లో ప్రజా ప్రభుత్వం వెలుగులు నింపుతున్నదని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్తు పథకం కింద నెలకు రూ. 900 కోట్ల చొప్పున అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ రూ.17,091 వేల కోట్లు రైతుల పక్షాన ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించిందని చెప్పారు.
ఉచిత విద్యుత్ ద్వారా రాష్ట్రంలోని 29.40 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వివరించారు. సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాల్కు రూ. 500 చొప్పున బోనస్ రూపంలో రూ. 1,199 కోట్లు రూపాయలు ప్రభుత్వం చెల్లించిందన్నారు. రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ పథకం కింద 42.16 లక్షల మంది రైతుల తరపున ఇన్సూరెన్స్ సంస్థలకు ఇప్పటి వరకూ రూ. 2,181 కోట్లు చెల్లించామని వివరించారు.
రైతన్నలకు రూ. 260 కోట్లు పంట నష్ట పరిహారం
అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని నాడు ప్రతిపక్షంలో ఉన్న తాము ధర్నాలు చేసినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కానీ అన్నదాతకు అండగా నిలవాలన్న ఆలోచనతో మనసున్న తమ ప్రభుత్వం ఇప్పటివరకూ పంట నష్టపరిహారం కింద రూ. 260 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు పంట నష్టం అందించడం కాదు కదా.. కనీసం సర్వే కూడా చేయలేదని విమర్శించారు.
భూమిలేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నేటి వరకు వారి ఖాతాల్లో రూ. 50 కోట్లు జమ చేశామని చెప్పారు. ఇందిరా సౌర గిరి వికాసం పథకం కింద 2.1 లక్షల గిరిజన రైతులకు సోలార్ విద్యుత్ తో నడిచే సాగునీటి పంపుసెట్లు, స్ప్రింక్లర్లు , డ్రిప్స్, ఉద్యాన శాఖ ద్వారా ఉచితంగా అవకాడో, వెదురు పామాయిల్ వంటి మొక్కలను అందిస్తున్నామని, ఇందుకోసం రూ. 12 వేల 600 కోట్లు కేటాయించామని తెలిపారు. అడవుల్లో పెద్ద నిర్మాణాలు, విద్యుత్ లైన్లు అవసరం లేకుండా గిరిజన రైతులకు సాగునీరు అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
నిరుపేద విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని, ప్రతి పాఠశాల 25 ఎకరాల్లో.. రూ. 200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి ఏడాది 58 పాఠశాలలు నిర్మించేందుకు రూ. 11,600 కోట్లు కేటాయించామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న 7.66 లక్షల మంది విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచామన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేలా..
కోటి మంది మహిళలను ఐదేండ్లలో కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. మొదటి ఏడాది లక్ష్యాన్ని మించి రూ. 21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పేరిట 9 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని, అర్హులైన యువత సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు 4 లక్షల వరకు నగదు సహాయం అందిస్తున్నామని తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఇప్పటివరకు 188 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని, ఆడబిడ్డల పక్షాన ప్రభుత్వమే ఆర్టీసీ సంస్థకు ఇప్పటివరకూ రూ.4,310 కోట్లు చెల్లించిందన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని, ఈ పథకం ద్వారా 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నదని చెప్పారు. సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన రూ. 580 కోట్లు ఇప్పటికే చెల్లించిందన్నారు.
కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అనేలా రైతుల హృదయాల్లో నిలిచామని చెప్పారు. బూత్ , మండల, జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు పీసీసీ కార్యాచరణ రూపొందించాలని ఈ పీఏసీలో తీర్మానించామని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకా లను ఇంటింటికీ, కిందిస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఒక పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇందులో నిర్ణయించామన్నారు.
పదేండ్లు అధికారంలో ఉండి, బీసీలకు మేలు జరిగే సర్వేలో పాల్గొనని వారు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీల కుల సర్వే గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమేనని పరోక్షంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై విమర్శలు చేశారు. బీసీ కుల గణనపై కేబినెట్లో తీర్మానం చేశా మని, ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించామని చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ కు పంపామని, ఇది బీసీల కుల గణనపై తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు.