
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను మార్చి 2026 నాటికి అంతమొందిస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసిన రోజు నుంచి వందలాదిమంది మావోయిస్టులు ఎన్కౌంటర్కు గురయ్యారు. వారిలో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శితో పాటు కొంతమంది అగ్ర నాయకులు ఉన్నారు.
కర్రె గుట్టలలో దాదాపు 3వేల వరకు మావోయిస్టులు ఉన్నారని సమాచారంతో 25 వేల మంది సైన్యంతో గుట్టలను చుట్టుముట్టి నరమేధానికి పూనుకుంది ప్రభుత్వం. హింస సమాజానికి పనికిరాదు. మనిషిని తోటి మనిషి చంపుకోవడం అనాగరికం. యుద్ధాలు, చంపుకోవడాలు రాచరిక వ్యవస్థలో భాగం. రాచరిక వ్యవస్థ అభివృద్ధి నిరోధకమని ప్రజలకు స్వేచ్ఛా స్వతంత్రాలు ఉండవని ఆ వ్యవస్థను తిరస్కరించి ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజలు నెలకొల్పుకున్నారు. తాము ఆయుధాలు పక్కన పెట్టామని కాల్పుల విరమణ పాటిస్తున్నామని ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ పాటించాలని కోరారు మావోయిస్టులు. ఆయుధాలు పక్కనపెట్టిన వారిని చంపడం చట్టవిరుద్ధం, ప్రజాస్వామ్య వ్యతిరేకం.
శాంతిని నెలకొల్పాలి
మావోయిస్టులతో చర్చలు జరపాలని, శాంతిని నెలకొల్పాలని.. పోలీసులు, సైన్యం, ఆదివాసులు, మావోయిస్టులు ఎవరూ చనిపోకూడదని మేధావులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పజెప్పడం కావచ్చు. ఇంకా అనేక కారణాల వల్ల అన్నలు అడవులను ఖాళీ చేసేవరకు, వారిని తుదముట్టించేవరకు వెనక్కు తగ్గేది లేదని ప్రభుత్వం అంటోంది. మావోయిస్టు పార్టీ బలహీన పడ్డ సందర్భంగా బలం పుంజుకోవడానికి ఎత్తుగడగా శాంతి చర్చలు ప్రతిపాదిస్తున్నారని ఆయుధాలు ప్రభుత్వానికి అప్పగిస్తే చర్చలకు అవకాశం ఉంటుందని మాట్లాడుతున్నారు.
యుద్ధాన్ని ఆపమని పాకిస్తాన్ భారతదేశాన్ని కోరిందని అందుకే ఆపామని భారత ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ బలహీన దేశమని, పీఓకేను ఆక్రమించుకోవడానికి ఇదే సరైన అవకాశమని, యుద్ధం విరమించడం అన్యాయమని విదేశాంగ కార్యదర్శిని ట్రోల్ చేశారు ప్రజలు. శత్రువు అంతం కాలేదు. ఇంకా వేలాదిమంది టెర్రరిస్టులు పాకిస్తాన్లో తలదాచుకున్నారు. ఇంకా వారితో ప్రమాదం పొంచి ఉంది. అయినా అడగగానే యుద్ధం ఆపేశారు. అయితే, ఇది మంచి పరిణామమే.
చర్చలకు అభ్యంతరం ఏమిటి?
శత్రుదేశంతో శాంతి కావాలని కోరుకున్న ప్రధాని మన దేశపౌరులైన సాయుధులతో శాంతి కావాలని వారితో చర్చలకు అంగీకరించాలని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. నాగాలాండ్, మిజోరం, అస్సాం, త్రిపుర ప్రదేశాల్లో సాయుధ తిరుగుబాటుదారులతో చర్చించినప్పుడు.. వేల కోట్లు ఖర్చుపెట్టి అన్నలను వేటాడవలసిన అవసరం ఎందుకని మావోయిస్టులతో చర్చించడానికి అభ్యంతరం ఏమిటని అడుగుతున్నారు. హింసకి పోలీసులు, సైన్యం, అమాయక గిరిజనులు, మావోయిస్టులు, మన దేశ పౌరులు ఎవరూ కూడా బలికావద్దు.
పెరుగుతున్న ప్రజాచైతన్యం
మావోయిస్టులు ప్రజలను చైతన్యం చేసి ప్రజలతో కలిసి పనిచేసే ప్రజా ఉద్యమాలను నిర్మించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పద్ధతిలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ప్రజా ప్రభుత్వాన్ని అందించవచ్చు. వారికి ఈ పద్ధతిలో తీవ్రమైన విభేదాలు ఉండవచ్చు. కానీ, మీరు అనుకున్నట్టు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సంపాదించాలనుకునే ఆలోచనను మార్చుకోకపోతే సమసమాజ స్థాపన పక్కకు పెట్టి మీ మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొన్నది.
ప్రజాస్వామ్యంగా ఏర్పడ్డ దేశాలు చాలా గొప్ప పరిపాలన అందించకపోయినా ప్రజల చైతన్య స్థాయి క్రమంగా పెరుగుతుండటం, ఆయా ప్రభుత్వాలలో క్రమానుగత మార్పులు చోటు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. క్రమానుగతంగా వచ్చే చైతన్యమే, నిలకడగా వచ్చే మార్పే బహుశా ప్రజాచైతన్యంలో దీర్ఘకాలంపాటు కొనసాగగలదు.
ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి
మన దేశంలో మెజారిటీ ప్రజల జీవన విధానం చాలా దుర్భరంగా ఉంది. సంపద అంతా పిడికెడు మంది చేతులలో కేంద్రీకృతమైంది. పార్టీని పక్కకు పెడితే రాహుల్ గాంధీ ఈ విషయాన్ని నిరంతరాయంగా మాట్లాడుతున్నారు. దేశంలో నియంతృత్వం రాజ్యమేలుతోంది. ప్రజలను కులాలు, మతాల పేరుతో విడగొడుతున్నారు. మావోయిస్టు పార్టీ ప్రజల కోసం పనిచేసే చిత్తశుద్ధి గల పార్టీ అయితే, ఆయుధాలను విడిచిపెట్టి ప్రజల కోసం, ప్రజా జీవితాల మెరుగుదల కోసం, అసమానతలు లేని సమాజం కోసం పాటుపడే పార్టీగా మీరు భావిస్తే బేషరతుగా ప్రజాజీవనంలోకి అడుగుపెట్టాలి.
చర్చల్లో పార్టీకి సంబంధించిన నాయకులపై కార్యకర్తలపై ఎలాంటి కేసులుగాని, హింసగాని ఉండకూడదని షరతు తప్ప, మరే ఇతరేతర డిమాండ్స్ పెట్టకండి. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణ పునరుద్ధరణకు ప్రజాస్వామికవాదులతో కలిసి పని చేయడానికి, మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి, ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించడానికి ఆయుధాలను వదిలిపెట్టి ప్రజలతో కలిసి పని చేసినప్పుడే సాధ్యం.
సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టాలి
ఆయుధాలు వదిలిపెట్టమని అనుకుంటే.. మీపై జరుగుతున్న దాడిని ఆపాలని విద్యావేత్తలు, ప్రజాస్వామికవాదులు, సామాజికవేత్తలు చేసే ప్రయత్నాలు వృథా అవుతాయి. ఆయుధాలు వదిలిపెట్టి ప్రజా రాజకీయాలు చేస్తామని ప్రకటించండి. దేశంలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పడానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. లేనిపక్షంలో మావోయిస్టు పార్టీకి మాత్రమే కాదు ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది.
ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్న మీరు సాధించిన ఫలితాలను కూడా సమీక్షించుకోవాలి. జరిగిన ప్రాణ నష్టం ఎంత? తద్వారా సాధించిన గుణాత్మక మార్పు ఎంత? అనే విషయాన్ని బేరీజు వేసుకుంటే ఈ విషయం సులభంగా అర్థం అవుతుంది. 2011 ఈజిప్ట్ ప్రజా ఉద్యమం, శ్రీలంక ప్రజల తిరుగుబాటు, బంగ్లాదేశ్ ప్రజల తిరుగుబాటు, ప్రజల చైతన్యంతో ఆయుధాలు లేకుండా జరిగిన ప్రజాతిరుగుబాటుతో ప్రభుత్వాలు మారిన సందర్భాలు మన ముందున్న ఉదాహరణలు. వామపక్ష పార్టీలు ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగ పరిరక్షణకు పనిచేసే రాజకీయ పార్టీలతో ఐక్య సంఘటనతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే పని సులభమవుతుంది. ప్రజలకు మెరుగైన జీవితాన్నిచ్చే పార్లమెంటరీ రాజకీయాలకు పునాది వేయాలి.
- డా. జగదీశ్వర్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం, తెలంగాణవిద్యావంతుల వేదిక-