ఇంకా ఐదు రోజులు వానలు

ఇంకా ఐదు రోజులు వానలు

హైదరాబాద్‌, వెలుగు : రాష్ట్రంలో కొన్ని చోట్ల రానున్న ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది. 23న ఉరుములు, మెరుపులు, వడగండ్లు పడతాయని గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కి.మీ. వేగంతో
ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా కర్ణాటక నుంచి మరఠ్వాడ వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడటమే ఇందుకు కారణమని వెల్లడించింది. ఇక మేఘాల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట పిడుగులు కూడా పడవచ్చని అధికారులు చెబుతున్నారు.

నేడు వానలు పడే చాన్స్‌ ఉన్న జిల్లాలు

రాష్ట్రంలో మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, వికారాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, జనగాం, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలిక పాటినుంచి మోస్తరు
వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అక్కడక్కడా మోస్తరు వానలు..

సోమవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. ఏడు చోట్ల మోస్తరు, 24 ఏరియాల్లోతేలికపాటి, 46 చోట్ల అతి తేలికపాటి జల్లులు కురిశాయి. సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలో 49.3, వికారాబాద్‌లోని పుట్టపహాడ్‌లో 38.3, సంగారెడ్డిలోని పాశమైలారంలో 22.5 మిల్లీమీటర్ల చొప్పున వరపాతం నమోదైంది. మరో వైపు రాష్ట్రంలో ఎండలు కూడా దంచికొడుతున్నాయి. నిర్మల్‌లోనిపెంబిలో 42.2డిగ్రీలు, వడ్యాల్‌, జిగిత్యాల జిల్లాలోని నేరెళ, గోదూరులో 41.9డిగ్రీలు, ఐలాపూర్‌లో 41.6 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.