
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచమే స్తంభించిన వేళ క్రికెట్ ఆట కూడా నిలిచిపోయింది. ఇన్నాళ్లు క్రికెట్ అభిమానులు మ్యాచ్ లు లేక నిరుత్సాహపడిపోయారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేందుకు క్రికెట్ మళ్లీ వస్తోంది. ఇంగ్లాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు లండన్ చేరుకుంది. వాస్తవానికి ఈ సిరీస్ జూన్ లోనే మొదలవ్వాల్సి ఉండగా, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని జూలై 8 నుంచి షురూ కానుంది. ఈ లోపు ఆటగాళ్లకు కరోనా వైద్య పరీక్షలు, విదేశాల నుంచి వచ్చినందున 14 రోజుల ముందస్తు క్వారంటైన్ వంటి చర్యలు తీసుకోనున్నారు.
ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మూడు టెస్టుల్లో మొదటి టెస్ట్ సౌతాంప్టన్ లోని ఏగాస్ బౌల్ లో(జూలై 8-12), మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో రెండవ,మూడవ మ్యాచ్లతో జూలై 16-20 వరకు.. ఆ తర్వాత జూలై 24-28 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి.
కరోనా విజృంభిస్తున్న క్రమంలో స్టేడియాల్లో ప్రేక్షకుల్లేకుండానే మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ సిరీస్ ద్వారా కొన్ని విప్లవాత్మకమైన మార్పులు క్రికెట్ లో ప్రవేశించనున్నాయి. బంతికి ఉమ్మిపూయడం, వికెట్లు పడినప్పుడు చేతులు కలపడం (హై-ఫై) వంటి చర్యలు ఇకపై ఉండకపోవచ్చు.
వెస్టిండీస్ జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్వుడ్, న్క్రుమా బోన్నర్, క్రైగ్ బ్రాత్వైట్, షమర్ బ్రూక్స్, జాన్ కాంప్బెల్, రోస్టన్ చేజ్, రాహకీమ్ కార్న్ వాల్, షేన్ డౌరిచ్, కెమర్ హోల్డర్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, రేమోన్ రీఫెర్, కేమర్ రోచ్.