కరోనా లక్షణాల్లో తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఊపిరి సరిగా అందకపోవడం ముఖ్యమైనవి. అయితే వైరస్ ఉన్న వాళ్లలో కొంతమందికి లక్షణాలు కనిపించొచ్చు. కనిపించకపోవచ్చు. లేదా కొన్ని లక్షణాలే కనిపించొచ్చు. కరోనా లక్షణాలపై రోజుకో కొత్త విషయం తెలుస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా చేసిన ఒక స్టడీలో చాలామంది కోవిడ్ పేషెంట్లు.. తమకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్నట్టు తెలియలేదని చెప్పారట. అంతా నార్మల్గానే అనిపిస్తుంది కానీ లోపల వైరస్ ఉంటుంది. ఇలాంటప్పుడు వైరస్ను పసిగట్టాలంటే చేతిలో పల్స్ ఆక్సిమీటర్ ఉండాలి.
కోవిడ్ కేసుల్లో రెండు రకాలున్నాయి. ఒకటి సింప్టమాటిక్ కేసులు. అంటే లక్షణాలు తీవ్రంగా కనిపించి, హాస్పిటల్లో జాయిన్ అయ్యే వాళ్లు. రెండు అసింప్టమాటిక్ కేసులు. అంటే ఒంట్లో వైరస్ ఉన్నా కూడా లక్షణాలు ఏవీ బయటపడని వాళ్లు. ఇక్కడ నష్టం ఎక్కువ జరిగేది అసింప్టమాటిక్ కేసులతోనే.. ఎందుకంటే వీళ్లలో వైరస్ ఉన్నా.. లక్షణాలు కనిపించవు కాబట్టి టెస్ట్ చేసే వరకూ వీళ్లకు వైరస్ ఉన్నట్టు తెలీదు. దాంతో వైరస్ పక్కవాళ్లకు సోకే ప్రమాదముంది. అలాగే వాళ్ల శరీరంలో కూడా వైరస్ వల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది. అందుకే లక్షణాలు పైకి కనిపించకపోయినా.. శరీరంలో ఎలాంటి మార్పులొస్తున్నాయో మనమే.. కొన్ని పరికరాల ద్వారా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైంది పల్స్ ఆక్సి మీటర్.
ముందు జాగ్రత్తగా..
కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సైలెంట్గా న్యుమోనియా కలిగిస్తుంది. అంటే పైకి కనిపించకుండానే ఊపిరితిత్తులు న్యుమోనియా వల్ల ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి వ్యక్తి చనిపోవడానికి కారణమవుతుంది. కొంతమంది రోగుల్లో కోవిడ్ న్యుమోనియా లక్షణాలు ముందే బయటపడక పోవచ్చు లేదా వారం పది రోజుల తర్వాత బయటపడొచ్చు. కానీ ఈలోపు ఊపిరితిత్తులకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే ఈ సైలెంట్ న్యుమోనియాను ముందుగా గుర్తించగలిగితే రోగులను వెంటిలేటర్ పై ఉంచాల్సిన ఆవసరం రాకుండా ముందు జాగ్రత్తలతో వాళ్ల ప్రాణాలను కాపాడొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడాన్ని ‘హైపోక్సియా’ అంటారు. ఇది బయటకు కనిపించకపోయినా.. పల్స్ ఆక్సిమీటర్ సాయంతో మాత్రం పసిగట్టొచ్చు.
ఇలా పనిచేస్తుంది
పల్స్ ఆక్సిమీటర్.. మన శరీరంలోని అన్ని భాగాలకు గుండె ఎలా ఆక్సిజన్ను సరఫరా చేస్తుందో గుర్తిస్తుంది. రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల వచ్చే సమస్యలను గుర్తించడం కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఆస్తమా, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి వాటిలో ఈ మీటర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది.
పల్స్ ఆక్సిమీటర్ ను వాడడం కూడా ఎంతో ఈజీ. ఏదో ఒక చేతి వేలి కొనకు ఈ మీటర్ను ఉంచి ఒక్క బటన్ నొక్కితే చాలు. కొన్ని సెకన్ల తర్వాత డిస్ప్లేలో పల్స్ రేట్తో పాటు ఆక్సిజన్ శాచ్యురేషన్ రేటు కనిపిస్తుంది. సాధారణంగా మనిషి రక్తంలో ఆక్సిజన్ లెవల్ 94 నుంచి 100 శాతం వరకు ఉండాలి. అలాగే పల్స్ రేటు 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. ఈ రెండు రీడింగ్స్.. ఉండాల్సిన దానికంటే తక్కువగా పడిపోయినా, పెరిగినా ప్రమాదమని గుర్తించాలి. పల్స్ ఆక్సిమీటర్ ధర రెండువేల రూపాయల వరకూ ఉంటుంది. ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది.
ఇప్పటికి ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ఈ పల్స్ ఆక్సిమీటర్ ఉపయోగపడిందని డాక్టర్లు చెప్తున్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్కు కూడా పల్స్ ఆక్సిమీటర్ ద్వారా హైపోక్సియాను ముందే గుర్తించడం వల్లే ట్రీట్మెంట్ తేలికైందని డాక్టర్లు అన్నారు. అందుకే ప్రతి ఇంట్లో ఒక పల్స్ ఆక్సిమీటర్ ఉండడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.
