దళిత బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి పై మీ‌‌ వైఖరేంటి?

దళిత బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి పై మీ‌‌ వైఖరేంటి?
  • దళిత బంధు హుజూరాబాద్ ప్రజలకు‌ ఇవ్వద్దంటారా...?
  • బీజేపీ వైఖరి ఏంటి.. ? బండి సంజయ్ సమాధానం చెప్పాలి: మంత్రి హరీష్ రావు

సిద్దిపేట: దళిత బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి పై మీ‌‌ వైఖరేంటి ? దళిత బంధు హుజూరాబాద్ ప్రజలకు‌ ఇవ్వద్దంటారా...? బీజేపీ వైఖరి ఏంటి.. ? పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని మంత్రి హరీష్ రావు కోరారు. పెట్రోల్, డిజీల్ గ్యాస్ ధరలు పెంచినందుకు  బీజేపీకి  ఓటు  వేయాలా.. ? అని ప్రశ్నించిన ఆయన మాజీ మంత్రి ఈటలకు పార్టీలో  ఎక్కువే ఇచ్చిందని, హుజూరాబాద్ ఎన్నికల్లో తెరాస‌ గెలుపు పక్కా అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెరాస‌ సోషల్ మీడియా వారియర్లకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపు.
సిద్దిపేటలో టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి సమావేశం
సిద్దిపేటలో ఆదివారం టీఆర్ఎస్  సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ పార్టీ వర్గాలకు ముఖ్యంగా సోషల్ మీడియా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ అసత్య ప్రచారంతో హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. గోబెల్స్ కన్నా తీవ్ర స్థాయిలో అబద్ద ప్రచారానికి దిగుతోందన్నారు. గోబెల్స్ బతికి ఉంటే బీజేపీ ప్రచార తీరు చూసి ఉరి వేసుకుంటాడని ఆయన  ఎద్దేవా చేశారు. 2014 లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబరు వన్ గా నిలిపిందన్నారు. 
తెలంగాణలో టీఆర్ఎస్ నెంబర్ వన్ పాలన అందిస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అధ్వాన్న స్థితిలోకి నెట్టేసేలా పాలించిందని.. దేశ జీడీపీ బంగ్లాదేశ్ జీడీపీ కన్నా తక్కువ పడిపోయేలా బీజేపీ పాలించిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. హుజూరాబాద్ లో అసలు బీజేపీ వాళ్లు ఏం చెప్పి ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల‌ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వ నందుకు ఓట్లు  అడుగుతారా ..? పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలు పెంచామని చెప్పి ఓట్లు అడుగుతారా..? అని నిలదీశారు.  గత ఏడాది  వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ కిరాయి ఎకరానికి 3  వేలు ఉంటే, నేడు ‌ఎకరానికి ఐదు వేలు అడుగుతున్నారని, డిజీల్ ధర అరవై రూపాయల నుండి‌ నూటా ఆరు రూపాయల కు పెంచి రైతుల నడ్డి విరిచినందుకు ఓట్లు అడుగుతారా..? అని మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు.  కేసీఆర్ ఐదు వేలు రైతు బందు  కింద రైతులకు ఇస్తే డిజీల్  ధరలు  పెంచి బీజేపీ ప్రభుత్వం 2500 రూపాయలు ఇంకో చెత్తో తీసుకుంటోందని విమర్శించారు. 
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ ఉద్యోగాలు ఊడగొడుతోందని, మళ్లీ మేం ఉద్యోగాలు ఇవ్వడం లేదని సోషల్ మీడియా లో తప్పుడు ఆరోపణలు చేస్తోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీసీ సంక్షేమ శాఖ పెట్టమని కోరితే ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేందుకు డిజిన్విస్టమెంట్ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. దీనివల్ల  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రక్రియ బీజేపీ ప్రభుత్వం చేపడుతోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ వంటి సంస్థలకు మూడు వేల కోట్లు ఇచ్చి ఉద్యోగులను కాపాడుకుంటోందన్నారు. ఇప్పటికే  లక్షా 30 వేల‌ ఉద్యోగాలను భర్తీ చేశాం, త్వరలో మరో 50  నుంచి 60‌వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 
హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే వచ్చే లాభం ఏంటి?  గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం.. అక్కడి అభివృద్ధి కుంటుపడుతుంది, వ్యక్తి ప్రయోజనమా....హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా..అన్న చర్చ పెట్టాలని మంత్రి హరీష్ రావు సూచించారు. దళిత బందు హుజూరాబాద్ లో వద్దని ఈటల రాజేందర్ అంటున్నారు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు పరిగ ఏరుకున్నట్లు అవసరం లేదన్నారు, బీజేపీ వైఖరేంటో బండి సంజయ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో ఓట్లు అడిగే ముందు కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధుపై బీజేపీ వైఖరి ప్రకటించాలన్నారు. రైతు బంధును హుజూరాబాద్ లో మొట్టమొదటి గా ప్రారంభిస్తే ఆనాడు ఈటల చప్పట్లు కొట్టారని, అదే సెంటిమెంట్ తో హుజూరాబాద్ లో దళిత బంధు ప్రారంభిస్తామని సీఎంగారు ప్రకటిస్తే గుండెలు బాదుకుంటున్నారని విమర్శించారు. 
కొద్ది మంది బీజేపీ నేతలు‌ ఎన్నికల‌ సంఘానికి ఫిర్యాదు చేశారని, తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని‌ కేంద్ర ఎన్నికల‌ సంఘం పై ఒత్తిడి తెస్తున్నారని, దీని‌వల్ల దళిత బంధు పథకం ఆగిపోతుందని వీరి ఆశ అన్నారు. రైతుబంధు, దళిత బంధు దండగ అనే బీజేపీ నేత .. ఈటల కావాలా...తెరాస కావాలా అన్న చర్చ పెట్టాలని సవాల్ చేశారు. దళిత‌బంధు పెడితే ఎన్నికల‌ కోసం అంటున్నారు. గత మార్చి నెలలో బడ్జెట్ లోనే దళితుల అభ్యున్నతికి 1200. కోట్లతో దళిత ఎంపవర్ మెంట్ స్కీం‌ ను ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో నేను ప్రకటించాననన్నారు. దళితులు బాగుపడటం బీజేపీ కు ఇష్టం లేదని, గడియారాలు, కుట్టు మిషన్లు, గొడుగులు, కుక్కర్లను ఈటల రాజేందర్  పంచుతూ హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అందుకే ప్రజలు సీఎం కేసీఆర్ ని గుండెల్లో పెట్టుకుని, ఆ గడియారాలను పగుల‌గొడుతున్నారని, తెరాస గెలుపు పక్కా..భారీ మెజారిటీతో గెలుపుకు కృషి‌ చేద్దామననారు. 
సోషల్ వారియర్లు నేటి తరం‌ కార్యకర్తలని, రానున్ను రోజుల్లో పార్టీలో మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. బీజేపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాన్ని అడ్డుకుందామని ఆయన కోరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను‌ ప్రజల్లోకి తీసుకెళ్దాం అని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే బాల్క సుమన్ , ఎర్రోళ్ల శ్రీనివాస్ , గెల్లు శ్రీనివాస్ ,  కౌశిక్ రెడ్డి , సతీష్ , దినేష్ , జగన్మోహన్ రావు , వివిధ జిల్లాల నుండి వచ్చిన టి ఆర్ ఎస్ పార్టీ  సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.