- కాంగ్రెస్ వైపా..? వైఎస్సార్టీపీ వైపా?
- ఏ పార్టీలో చేరబోతున్నారు..?
మహబూబ్నగర్/దేవరకద్ర, వెలుగు: పాలమూరులో రాజకీయం రంగులు మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా ఇప్పటి నుంచే నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు కండువాలు మార్చే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఫాం, ఇతర అవకాశాలపై హామీలు తీసుకొని క్యాడర్తో సహా చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డి, ఆయన సతీమణి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డి కూడా త్వరలో పార్టీ మారనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో టీడీపీ వైభవాన్ని కోల్పోవడంతో ఇప్పటికే సీనియర్లంతా ఇతర పార్టీలోకి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలో వీరు కూడా పార్టీ మారే అవకాశాలపై సోమవారం అనుచరులతో చర్చించినట్లు తెలిసింది. అయితే ఏ పార్టీలో చేరతారనేదానిపై సస్పెన్స్ నెలకొంది. క్యాడర్లో కొందరు కాంగ్రెస్ వైపు చూస్తుండగా.. మరికొందరు వైఎస్సార్ టీపీని ఆప్షన్గా సూచించినట్లు సమాచారం.
జిల్లాలో పట్టున్న నేత
కొత్తకోట దయాకర్రెడ్డిది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. విద్యార్థి దశ నుంచే లీడర్గా ఎదిగిన ఆయన 1987లో ఎన్టీ రామారావు సమక్షంలో టీడీపీలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదేపార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ తరఫున 1989లో మొదటి సారిగా అమరచింత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1994లో మరోసారి విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. 2004 లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు ఉండగా, టీఆర్ఎస్ అభ్యర్థికి మక్తల్ అసెంబ్లీ టికెట్ దక్కింది. ఇదే టికెట్ను ఆశించిన దయాకర్రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసి విన్ అయ్యారు. ఇదే ఏడాది కొత్తగా ఏర్పడిన దేవరకద్ర నియోజకవర్గం నుంచి దయాకర్రెడ్డి భార్య సీత కూడా టీడీపీ నుంచి పోటీ విజయం సాధించారు. 1999లో ఈమె దేవరకద్ర జడ్పీటీసీగా గెలుపొంది, ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్గా పని చేశారు.
చంద్రబాబుతో భేటీ తర్వాతే నిర్ణయం
తెలంగాణ టీడీపీలో నాయకత్వం కొరవడింది. స్వరాష్ర్టం ఏర్పడిన తరువాత పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. రెండు సార్లు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీంతో ఇదే పార్టీలో ఉన్న రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చేరి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగా, ఇటీవల టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ కారెక్కారు. దీంతో పార్టీ నాయకత్వంపై అనిశ్చితి నెలకొంది.
షాద్నగర్కు చెందిన బక్కని నర్సింహులుకు అవకాశం ఇచ్చినా పెద్దగా ప్రభావం చూపడం లేదు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ పరిస్థితిపై దయాకర్రెడ్డితో పాటు మరికొందరు నాయకులు చంద్రబాబు నాయుడుతో త్వరలో భేటీ కానున్నట్లు తెలిసింది. ఈ భేటీలో పార్టీకి పూర్వవైభవానికి ఆయన తీసుకునే చర్యల ఆధారంగా ఇతర పార్టీల్లో చేరే విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
ఎక్కువ సీట్లు ఇస్తేనే..
దయాకర్రెడ్డితో పాటు ఆయన భార్య కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరి కుమారుడు సిద్ధార్థ్రెడ్డిని కూడా రాజకీయ అరంగేట్రం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు ఏ పార్టీలో చేరినా దేవరకద్ర, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ స్థానాలపై హామీ తీసుకుంటారనే చర్చ నడుస్తోంది. దేవరకద్ర నుంచి సీతమ్మ, మక్తల్ నుంచి దయాకర్రెడ్డి పోటీకి సిద్ధంగా ఉండగా, నారాయణపేట నుంచి సిద్ధార్థ్రెడ్డిని బరిలో దింపేందుకు సన్నద్ధం చేస్తున్నారు. దేవరకద్ర నుంచి కాంగ్రెస్ తరఫున జి.మధుసూదన్రెడ్డి, ప్రదీప్కుమార్గౌడ్ మధ్య ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ ఉండగా, బీజేపీ నుంచి డోకూరు పవన్ కుమార్రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. నారాయణపేట కాంగ్రెస్ నుంచి ఆ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, చిట్టెం అభిజిత్రెడ్డి మధ్య టికెట్ కోసం పోటీ ఉండే చాన్స్ఉంది.
బీజేపీ నుంచి నాగూరావు నామాజీ, రతంగ్పాండురెడ్డి, సత్యయాదవ్ కూడా ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించే అవకాశం ఉంది. ఇక మక్తల్ కాంగ్రెస్లో వాకిటి శ్రీహరి, రాజుల ఆశిరెడ్డికి ఉండగా, బీజేపీ నుంచి కొండయ్య, జలంధర్రెడ్డిలు ఉన్నారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండనే ఉన్నారు. ఈ లెక్కన వైఎస్సార్ టీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల వీరిని కాంగ్రెస్లోకి ఆహ్వానించగా.. అనుచరులతో చర్చించి నిర్ణయం చెబుతామని మాటిచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ గట్టి హామీ ఇస్తే కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు.