కొత్తకోట దంపతుల దారెటు?

కొత్తకోట దంపతుల దారెటు?
  • కాంగ్రెస్‌ వైపా..? వైఎస్సార్‌‌టీపీ వైపా?
  • ఏ పార్టీలో చేరబోతున్నారు..?

మహబూబ్​నగర్​/దేవరకద్ర, వెలుగు: పాలమూరులో రాజకీయం రంగులు మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా ఇప్పటి నుంచే నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు కండువాలు మార్చే పనిలో పడ్డారు.  వచ్చే ఎన్నికల్లో బీఫాం, ఇతర అవకాశాలపై హామీలు తీసుకొని క్యాడర్​తో సహా చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  మక్తల్ ​మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్​రెడ్డి, ఆయన సతీమణి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌‌ రెడ్డి కూడా త్వరలో పార్టీ మారనున్నట్లు సమాచారం.  రాష్ట్రంలో టీడీపీ వైభవాన్ని కోల్పోవడంతో  ఇప్పటికే సీనియర్లంతా ఇతర పార్టీలోకి జంప్​ అయ్యారు.  ఈ నేపథ్యంలో వీరు కూడా పార్టీ మారే అవకాశాలపై సోమవారం అనుచరులతో చర్చించినట్లు తెలిసింది.  అయితే ఏ పార్టీలో చేరతారనేదానిపై సస్పెన్స్ నెలకొంది.  క్యాడర్‌‌లో కొందరు కాంగ్రెస్‌ వైపు చూస్తుండగా.. మరికొందరు వైఎస్సార్ టీపీని ఆప్షన్‌గా సూచించినట్లు సమాచారం. 
జిల్లాలో పట్టున్న నేత
కొత్తకోట దయాకర్​రెడ్డిది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. విద్యార్థి దశ నుంచే లీడర్​గా ఎదిగిన ఆయన 1987లో  ఎన్టీ రామారావు సమక్షంలో టీడీపీలో చేరారు.  అప్పటి నుంచి ఇప్పటి వరకు అదేపార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ తరఫున 1989లో మొదటి సారిగా అమరచింత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1994లో మరోసారి విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. 2004 లో టీడీపీ, టీఆర్​ఎస్​ పొత్తు ఉండగా, టీఆర్​ఎస్​ అభ్యర్థికి మక్తల్​ అసెంబ్లీ టికెట్​ దక్కింది. ఇదే టికెట్​ను ఆశించిన దయాకర్​రెడ్డి ఇండిపెండెంట్​గా పోటీ చేసి విన్ అయ్యారు. ఇదే ఏడాది కొత్తగా ఏర్పడిన దేవరకద్ర నియోజకవర్గం నుంచి దయాకర్​రెడ్డి భార్య సీత కూడా టీడీపీ నుంచి పోటీ విజయం సాధించారు. 1999లో ఈమె దేవరకద్ర జడ్పీటీసీగా గెలుపొంది, ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్పీ చైర్​పర్సన్​గా పని చేశారు. 
చంద్రబాబుతో భేటీ తర్వాతే నిర్ణయం
తెలంగాణ టీడీపీలో నాయకత్వం కొరవడింది.  స్వరాష్ర్టం ఏర్పడిన తరువాత పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. రెండు సార్లు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీంతో ఇదే పార్టీలో ఉన్న రేవంత్​రెడ్డి కాంగ్రెస్​లో చేరి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగా, ఇటీవల టీడీపీ  తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ కారెక్కారు. దీంతో  పార్టీ నాయకత్వంపై అనిశ్చితి నెలకొంది.

షాద్‌నగర్‌‌కు చెందిన బక్కని నర్సింహులుకు అవకాశం ఇచ్చినా పెద్దగా ప్రభావం చూపడం లేదు. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ పుంజుకుంటున్నాయి.  ఈ క్రమంలోనే పార్టీ పరిస్థితిపై దయాకర్​రెడ్డితో పాటు మరికొందరు నాయకులు చంద్రబాబు నాయుడుతో త్వరలో భేటీ కానున్నట్లు తెలిసింది. ఈ భేటీలో పార్టీకి పూర్వవైభవానికి ఆయన తీసుకునే చర్యల ఆధారంగా ఇతర పార్టీల్లో చేరే విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. 
ఎక్కువ  సీట్లు ఇస్తేనే..
దయాకర్​రెడ్డితో పాటు ఆయన భార్య కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు  సిద్ధంగా ఉన్నారు. వీరి కుమారుడు సిద్ధార్థ్​రెడ్డిని కూడా రాజకీయ అరంగేట్రం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు ఏ పార్టీలో చేరినా దేవరకద్ర, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ స్థానాలపై  హామీ తీసుకుంటారనే చర్చ నడుస్తోంది.  దేవరకద్ర నుంచి సీతమ్మ, మక్తల్​ నుంచి దయాకర్​రెడ్డి పోటీకి సిద్ధంగా ఉండగా, నారాయణపేట నుంచి సిద్ధార్థ్​రెడ్డిని బరిలో దింపేందుకు సన్నద్ధం చేస్తున్నారు.   దేవరకద్ర నుంచి కాంగ్రెస్‌ తరఫున జి.మధుసూదన్​రెడ్డి, ప్రదీప్​కుమార్​గౌడ్​ మధ్య ఎమ్మెల్యే టికెట్​ కోసం పోటీ ఉండగా, బీజేపీ నుంచి డోకూరు పవన్​ కుమార్​రెడ్డి టికెట్​ ఆశిస్తున్నారు.  నారాయణపేట కాంగ్రెస్ నుంచి ఆ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్​రెడ్డి, రేవంత్​రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, చిట్టెం అభిజిత్​రెడ్డి మధ్య టికెట్​ కోసం పోటీ ఉండే చాన్స్​ఉంది.

బీజేపీ నుంచి నాగూరావు నామాజీ, రతంగ్​పాండురెడ్డి, సత్యయాదవ్​ కూడా ఆ పార్టీ నుంచి టికెట్​ ఆశించే అవకాశం ఉంది.  ఇక మక్తల్​ కాంగ్రెస్​లో వాకిటి శ్రీహరి, రాజుల ఆశిరెడ్డికి ఉండగా, బీజేపీ నుంచి కొండయ్య, జలంధర్​రెడ్డిలు ఉన్నారు.  టీఆర్​ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండనే ఉన్నారు.  ఈ లెక్కన వైఎస్సార్‌‌ టీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల వీరిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించగా.. అనుచరులతో చర్చించి నిర్ణయం చెబుతామని మాటిచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ గట్టి హామీ ఇస్తే కాంగ్రెస్‌ వైపు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు.