ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ (MI vs KKR) మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఒక విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ టీమ్లో పనిచేస్తున్న ఇయాన్ విలియం లెగ్న్ఫోర్డ్ అనే బ్రిటిష్ ఇంజనీర్ తన హోటల్ గదిలో మరణించారు.
బ్రిటన్కు చెందిన ఇయాన్ విలియం లెగ్న్ఫోర్డ్ ఐపీఎల్ టెలికాస్ట్ బృందంలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆయన మార్చి 24 నుండి నారిమన్ పాయింట్లోని ట్రైడెంట్ హోటల్లో ఉంటున్నారు.
సోమవారం(30 మార్చ్) మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్కు వెళ్లిన ఆయన, తరువాత రోజు ఉదయం ఎంతకీ బయటకు రాలేదు. హోటల్ సిబ్బంది ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి మాస్టర్ కీతో గది తెరిచి చూశారు. అప్పటికే ఆయన గదిలో కింద పడిపోయి ఉన్నారు. హోటల్ డాక్టర్ వచ్చి పరీక్షించగా, ఇయాన్ అప్పటికే మరణించినట్లు తేలింది.
మెరైన్ డ్రైవ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. మరణానికి గల కారణలకి మృతదేహాన్ని పోస్ట్మార్టంకు పంపారు. ప్రస్తుతానికి ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు భావిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు పోస్ట్మార్టం నివేదిక వచ్చాకే తేలనుంది.
