కమల సారథి ఎవరో?

కమల సారథి ఎవరో?
  •  బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టుకు నోటిఫికేషన్ రిలీజ్
  • జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక కూడా..  
  • అధ్యక్ష రేసులో రాంచందర్ రావు, ఈటల రాజేందర్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర కొత్త సారథి ఎన్నిక ప్రక్రియ తుది దశకు చేరింది. మరికొద్ది గంటల్లో కొత్త చీఫ్​ ఎవరనే ఉత్కంఠకు తెరపడనున్నది. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు జాతీయ కౌన్సిల్ పోస్టుల ఎన్నికకు ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే, అధ్యక్ష రేసులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ పేర్లు వినిపిస్తున్నాయి. 

సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో అధ్యక్ష, నేషనల్ కౌన్సిల్ సభ్యుల పదవులకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఆశావహులనుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. 

కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి,  కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. అధ్యక్ష పదవికి ఒక్కటే నామినేషన్​ వస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఒకవేళ రెండు, అంతకన్నా ఎక్కువ నామినేషన్లు వస్తే ఎన్నికలు ఉంటాయా? ఉండవా? అనే వివరాలు నోటిఫికేషన్​లో వెల్లడించలేదు.  దీంతో దాదాపు అధ్యక్ష పదవి ఏకగ్రీవం అనేది స్పష్టమైంది.

పాత, కొత్త నేతల మధ్య పోటీ..

బీజేపీ అధ్యక్ష పదవికి చాలామంది పోటీ పడుతున్నారు. పార్టీలో ముఖ్య నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లు, ఈ మధ్య కాలంలోనే పార్టీలో చేరిన వాళ్లుగా డివైడ్ అయ్యారు. అధ్యక్ష పదవికి మొదటినుంచీ ప్రధానంగా ఎంపీలు ఈటల రాజేందర్, అర్వింద్​ధర్మపురి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పాత నేతల్లో ఎక్కువ మంది రాంచందర్ రావు పేరును సూచిస్తున్నారు. మరోపక్క కొత్త వారికి, బీసీ నేతలకే ఇవ్వాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇదే అంశంపైనా అంతర్గతంగా పార్టీలో గొడవలు జరగడంతో, అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్​ను కేంద్ర కమిటీ ఇవ్వలేదు. 

నేషనల్ కౌన్సిల్ కూ పోటీయే 

బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకూ నామినేషన్లను తీసుకోనున్నారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక్కొక్కరు చొప్పున మొత్తం తెలంగాణ నుంచి 17 మందిని ఎంపిక చేయనున్నారు. దీనికి సంబంధించి ఆయా సెగ్మెంట్ల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు.  జాతీయ అధ్యక్షుడిని ఈ నేషనల్ కౌన్సిల్ సభ్యులే ఎన్నుకోనున్నారు.