వచ్చే లోక్సభ ఎన్నికల్లో నాగర్కర్నూల్ (ఎస్సీ) నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ప్రధానంగా మూడు పార్టీల మధ్య హోరాహోరీ జరిగే అకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్తో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి చారగొండ వెంకటేశ్ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కొడుకు పోతుగంటి భరత్ప్రసాద్ను బీజేపీ బరిలోకి దింపింది. ఇక బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరు వినిపించినా బీఎస్పీతో పొత్తు కుదరడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పోటీలో ఉంటారని తెలుస్తోంది. నియోజకవర్గ సమీక్షా సమావేశాల్లో కూడా తానే పోటీలో ఉండబోతున్నానని ప్రవీణ్కుమార్ చెప్పడం ఇందుకు ఊతమిస్తోంది.
కారు, ఏనుగు పొత్తు కలిసివచ్చేనా ?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ చేజారడం ఆ పార్టీకి మైనస్గా మారింది. దీటైన అభ్యర్థి లేకపోవడంతో డైలామాలో పడింది. ఈ క్రమంలో ఆ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నాగర్కర్నూల్ లోక్సభ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడంతో బీఆర్ఎస్కు అభ్యర్థిని వెతికే పని తప్పింది. నియోజకవర్గ పరిధిలో సన్నాహక సమావేశాలు పెడుతున్న ప్రవీణ్ పనిలో పనిగా బీజేపీ, కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను, పాలనను, మాజీ సీఎం కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని ప్రవీణ్కుమార్తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వమని, దొరల పాలనలో బడుగులు బానిస బతుకులు బతకాల్సి వస్తుందన్నారు. కానీ, ఇప్పుడు పొత్తు పెట్టుకోవడంతో ప్రవీణ్కుమార్ పోటీ చేస్తే అదే బీఆర్ఎస్ను పొగడాల్సిన పరిస్థితి రావచ్చు. దీనిని ఓటర్లు రిసీవ్ చేసుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న. మరోవైపు ఉమ్మడి పాలమూరులోని గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రవీణ్కుమార్ పోటీలో ఉంటే స్థానికులతో పాటు బీఎస్పీ ఐడియాలజీ ఫాలో అయ్యేవాళ్లు, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారు. కాగా, ఎన్నికల్లో ప్రవీణ్కు బీఆర్ఎస్మాజీ ఎమ్మెల్యేలు ఎంత వరకు మద్దతిస్తారనేది తేలాల్సి ఉంది.