కారు - ఏనుగు పొత్తు కలిసొచ్చేనా.?

కారు - ఏనుగు పొత్తు కలిసొచ్చేనా.?

వచ్చే లోక్​సభ ఎన్నికల్లో నాగర్​కర్నూల్​ (ఎస్సీ) నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ప్రధానంగా మూడు పార్టీల మధ్య హోరాహోరీ జరిగే అకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్​ నుంచి టికెట్ రేసులో మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​తో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి చారగొండ వెంకటేశ్​ఉన్నారు. బీఆర్ఎస్ ​నుంచి తమ పార్టీలో చేరిన సిట్టింగ్ ​ఎంపీ పోతుగంటి రాములు కొడుకు పోతుగంటి భరత్​ప్రసాద్​ను బీజేపీ బరిలోకి దింపింది. ఇక బీఆర్ఎస్​ తరపున మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరు వినిపించినా బీఎస్పీతో పొత్తు కుదరడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ ​పోటీలో ఉంటారని తెలుస్తోంది. నియోజకవర్గ సమీక్షా సమావేశాల్లో కూడా తానే పోటీలో ఉండబోతున్నానని ప్రవీణ్​కుమార్​ చెప్పడం ఇందుకు ఊతమిస్తోంది.

కారు, ఏనుగు పొత్తు కలిసివచ్చేనా ? 

అసెంబ్లీ ఎన్నికల్లో  ఓటమితో డీలాపడ్డ  బీఆర్ఎస్​ నుంచి సిట్టింగ్​ ఎంపీ చేజారడం ఆ పార్టీకి  మైనస్​గా మారింది. దీటైన అభ్యర్థి లేకపోవడంతో డైలామాలో పడింది. ఈ క్రమంలో ఆ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. బీఎస్పీ రాష్ట్ర చీఫ్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ నాగర్​కర్నూల్ ​లోక్​సభ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడంతో బీఆర్ఎస్​కు అభ్యర్థిని వెతికే పని తప్పింది.  నియోజకవర్గ పరిధిలో సన్నాహక సమావేశాలు పెడుతున్న ప్రవీణ్ పనిలో పనిగా బీజేపీ, కాంగ్రెస్​పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ​ప్రభుత్వ విధానాలను, పాలనను, మాజీ సీఎం కేసీఆర్​ను, ఆయన​ కుటుంబాన్ని ప్రవీణ్​కుమార్​తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ ​అవినీతి ప్రభుత్వమని, దొరల పాలనలో బడుగులు బానిస బతుకులు బతకాల్సి వస్తుందన్నారు. కానీ,  ఇప్పుడు పొత్తు పెట్టుకోవడంతో ప్రవీణ్​కుమార్​ పోటీ చేస్తే అదే బీఆర్ఎస్​ను పొగడాల్సిన పరిస్థితి రావచ్చు. దీనిని ఓటర్లు రిసీవ్​ చేసుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న. మరోవైపు ఉమ్మడి పాలమూరులోని గద్వాల జిల్లా అలంపూర్ ​నియోజకవర్గానికి చెందిన ప్రవీణ్​కుమార్ ​పోటీలో ఉంటే స్థానికులతో పాటు బీఎస్పీ ఐడియాలజీ ఫాలో అయ్యేవాళ్లు, బీఆర్ఎస్​ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారు. కాగా, ఎన్నికల్లో ప్రవీణ్​కు బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యేలు ఎంత వరకు మద్దతిస్తారనేది తేలాల్సి ఉంది.