- ముడి సరుకుల ధరలు పెరగడమే ఇందుకు కారణం
- ధరలు పెంచితే అమ్మకాలు పడిపోతాయని భయం
- గత కొన్నేళ్లుగా శ్రింక్ఫ్లేషన్ స్ట్రాటజీని ఫాలో అవుతున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు
న్యూఢిల్లీ: మీ ఫేవరేట్ పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ సైజ్ తగ్గినట్టు అనిపిస్తోందా ? సబ్బులు, షాంపూలు వంటి ప్రొడక్ట్లను అమ్మే ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు ధరను పెంచకుండా, సైజ్ను తగ్గిస్తున్నాయి. ఆర్థిక పరిభాషలో దీనిని 'శ్రింక్ఫ్లేషన్' అని పిలుస్తారు. ధరలు పెంచితే అమ్మకాలు పడిపోతాయని ఇలా చేస్తారు. క్రూడాయిల్ ధరలు 100 డాలర్లు దాటడంతో ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.
1. శ్రింక్ఫ్లేషన్ స్ట్రాటజీ..
అన్ని రకాల రూ.10, రూ.20 చిన్న ప్యాకెట్ల బరువును తగ్గిస్తున్నామని, వీటి ధరలను పెంచితే అమ్మకాలు పడిపోతాయని అని డాబర్ ఇండియా సీఈఓ మోహిత్ మల్హోత్రా వెల్లడించారు. పెరుగుతున్న ఖర్చుల భారాన్ని తట్టుకోవడానికి డాబర్ కంపెనీ ఇప్పటికే కొన్ని ప్రొడక్ట్ల ధరలను దాదాపు 4శాతం మేర పెంచింది. అయితే, చిన్న ప్యాకెట్ల ధరలను నేరుగా పెంచడం కష్టమైన పని కావడంతో ఈ శ్రింక్ఫ్లేషన్ మార్గాన్ని ఎంచుకుంది.
2. రూ.పది, రూ.20 ధరల వెనకున్న సైకాలజీ..
భారతదేశ కన్స్యూమర్ మార్కెట్లో సామాన్యులు, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజలు ధరల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. షాంపూలు, టూత్పేస్ట్లు, జ్యూస్లు, రోజువారీ కిరాణా వస్తువుల చిన్న ప్యాకెట్లు ఈ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తాయి. వినియోగదారులు ప్యాకెట్ ఎంఆర్పీ ధర రూ.10 నుంచి రూ.11 లేదా రూ.12 కి పెరిగితే వెంటనే గుర్తిస్తారు. దీంతో అమ్మకాలు పడిపోయే ప్రమాదం ఉంది. కానీ ధర అంతే ఉంచి, బరువును కొద్దిగా తగ్గించినప్పుడు వినియోగదారులు అంత వేగంగా స్పందించరు. అందుకే కంపెనీలు ఈ ఫిక్స్డ్ ప్రైస్ పాయింట్స్ను దాటడానికి ఇష్టపడవు.
సైజ్ తగ్గుతూ వచ్చిన టాప్ బ్రాండ్స్..
1. బిస్కెట్లు, స్నాక్స్
పార్లే-జి: దశాబ్దాలుగా పార్లేజి రూ.5 ప్యాకెట్ ధర మారలేదు. కానీ అందులోని బిస్కెట్ల సంఖ్య, ప్యాకేజ్ బరువు తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు 100 గ్రాములు ఉన్న రూ.5 ప్యాకెట్, కాలక్రమేణా 80 గ్రాములు, 65 గ్రాములకు తగ్గి, ప్రస్తుతం దాదాపు 50-–55 గ్రాములకు చేరుకుంది.
బ్రిటానియా: ఈ కంపెనీ అమ్మే గుడ్ డే, మారీ గోల్డ్, 50–-50 బిస్కెట్ల రూ.10 ప్యాకెట్ల బరువు కూడా గత కొన్నేళ్లుగా 10 శాతం నుంచి 15శాతం వరకు తగ్గింది.
లేస్, కుర్కురే: ఈ బ్రాండ్ల రూ.5, రూ.10 ప్యాకెట్లలో చిప్స్ లేదా స్నాక్స్ పరిమాణాన్ని తగ్గించి, గాలి (నైట్రోజన్) శాతాన్ని పెంచారు.
2. సబ్బులు, డిటర్జెంట్లు
హిందుస్థాన్ యూనీలీవర్: పామాయిల్, ఇతర రసాయనాల ధరలు పెరిగినప్పుడు హెచ్యూఎల్ తన సబ్బులు లైఫ్బాయ్, లక్స్, వీల్ బరువును తగ్గించింది. ఉదాహరణకు, ఒకప్పుడు 100 గ్రాములు ఉన్న లక్స్ లేదా లైఫ్బాయ్ సబ్బు పరిమాణాన్ని రూ.10 లేదా రూ.20 ప్రైస్ పాయింట్లలో ఉంచడం కోసం 90 గ్రాములు లేదా 85 గ్రాములకు తగ్గించారు. వీల్, సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ పౌడర్ల చిన్న ప్యాకెట్ల బరువు కూడా ఇలాగే తగ్గింది.
గోద్రెజ్ నంబర్ వన్: ఈ బ్రాండ్ కూడా తమ సబ్బుల బండిల్ ప్యాక్లు, విడి సబ్బుల బరువును ధర పెంచకుండానే తగ్గించింది.
3. చాక్లెట్లు, పానీయాలు
క్యాడ్బరీ డెయిరీ మిల్క్: మోండెలెజ్ సంస్థ తమ డెయిరీ మిల్క్ చాక్లెట్ రూ.10, రూ.20 బార్ల మందాన్ని లేదా సైజును తగ్గించడం ద్వారా శ్రింక్ఫ్లేషన్ను అమలు చేసింది. కొన్నిసార్లు చాక్లెట్ క్యూబ్స్ సంఖ్యను కూడా తగ్గించింది.
నెస్లే మాగీ: ఒకప్పుడు రూ.10 లేదా రూ.12 కి లభించే సింగిల్ మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్ బరువు 100 గ్రాముల నుంచి క్రమంగా 70 గ్రాములకు పడిపోయింది.
4. పర్సనల్ కేర్, హెల్త్కేర్
డాబర్: డాబర్ కంపెనీ తమ పోర్ట్ఫోలియోలోని రూ.10, రూ.20 చిన్న ప్యాకెట్ల (షాంపూలు, టూత్పేస్ట్లు, జ్యూస్లు వంటివి) ధరలను పెంచలేక, వాటి బరువును తగ్గిస్తోంది.
కోల్గేట్: కోల్గేట్ కూడా తమ రూ.10 లేదా రూ.20 చిన్న టూత్పేస్ట్ ట్యూబ్ల పరిమాణాన్ని క్రమంగా తగ్గిస్తూ వస్తోంది.
