ఒంటి మీద బంగారం కోసం మర్డర్లు చేసే సైకో కిల్లర్ జంటను దుండిగల్ పరిసరాల్లో సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన స్వామి, అతని భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు పలు హత్యలు చేసినట్టు సైకో కిల్లర్లు ఒప్పుకున్నారు. భర్త 8 హత్యలు.. భార్య 11 మర్డర్లు చేసినట్టు పోలీసుల ముందు అంగీకరించారు. ఓ మిస్సింగ్ కేసు దర్యాప్తుతో కూపీ లాగితే.. సైకో కిల్లర్ల వ్యవహారం బయటపడింది.
ఈ సైకో కిల్లర్లు అడ్డాకూలీలనే టార్గెట్ చేసుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 25న మల్లంపేటలో భామిని అనే మహిళా కూలీని పని పేరుతో నిందితుడు స్వామి తన భార్యతో కలిసి మాదారం గుట్టల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్యచేసి.. ఒంటిపై ఉన్న బంగారం దోచుకున్నారు. పనికి తీసుకెళ్లిన స్వామిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. మాదారం గుట్టల్లో ఉన్న భామిని మృతదేహాన్ని స్వామి పోలీసులకు చూపించాడు. పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, దుండిగల్ సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా.. తాను చేరిన నేరాల్లో కొందరు మహిళలను అత్యాచారం చేసి చంపినట్టు నిందితుడు స్వామి ఒప్పుకున్నాడు. దాంతో స్వామి దంపతులపై కిడ్నాప్, ట్రాప్, మర్డర్, రేప్ కేసులు పెట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.